బీహార్‌‌లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందా? ఎంపీ రంజీత్ రంజన్ ఏమన్నారు?
x

బీహార్‌‌లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందా? ఎంపీ రంజీత్ రంజన్ ఏమన్నారు?

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందనేంటి? పార్టీ బలోపేతానికి వారు చేసిన సూచనలేంటి?


Click the Play button to hear this message in audio format

బీహార్‌(Bihar)లో కాంగ్రెస్(Congress) పార్టీ పరిస్థితి బాగోలేదని రాజ్యసభ సభ్యురాలు రంజీత్ రంజన్( Ranjeet Ranjan) చేసిన వ్యాఖ్యలు పార్టీ హైకమాండ్‌ను ఆందోళనకు గురిచేశాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. పార్టీ బలహీనతకు రాష్ట్రంలో నాయకత్వం వహిస్తున్న వారే ప్రధాన కారణమని రాహుల్ అభిప్రాయపడినట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర స్థాయి నాయకులదేనని.. ఆలస్యంగా విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకురాకపోవడం మంచిపద్ధతి కాదని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించినట్లు తెలుస్తోంది.


బీహార్ నాయకత్వంపై హైకమాండ్ ఫోకస్..

గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) విజయం సాధించింది. అదే సమయంలో గెలిచిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అధికార కూటమిలో చేరిపోతారన్న వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ శుక్రవారం (జనవరి 23) న్యూఢిల్లీలో బీహార్‌కు చెందిన పార్టీ నాయకత్వంతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.


‘మేమంతా కాంగ్రెస్‌‌లోనే కొనసాగుతాం’

సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) బీహార్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారా? అని నేరుగా అడిగినట్లు సమాచారం. దీనికి వారంతా ‘‘కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం” అని స్పష్టంగా సమాధానమిచ్చారని పార్టీ అంతర్గత సమాచారం. అయితే శాసనసభ్యులు పార్టీ మారడం కేవలం మీడియా సృష్టేనని ఖర్గే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.


నాయకుల్లో నిరాశకు కారణమేంటి?

గత ఏడాది రాహుల్ గాంధీ బీహార్‌లో నిర్వహించిన హై-వోల్టేజ్ ‘ఓటరు అధికార్ యాత్ర’కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించినా.. ఎన్నికల ఫలితాలు ఆశించినంతగా రాకపోవడంతో హైకమాండ్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. యాత్ర ప్రభావం ఫలితాల్లో కనిపించకపోవడం పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది.


S.I.R వెనక బీజేపీ హస్తం?

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(S.I.R) పేరుతో బీహార్‌లో అనేక వేల మంది ఓటర్ల పేర్లను తొలగించడం వెనక కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఉందని కాంగ్రెస్ అప్పట్లో ఆరోపించింది. ఎన్నికల కమిషన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ అంశాలన్నీ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.


‘రాష్ట్ర నాయకత్వానిదే జవాబుదారీ..’

బీహార్‌లో పార్టీ బలహీనతకు అక్కడి నాయకత్వమే బాధ్యత వహించాలని రంజీత్ రంజన్‌కు హైకమాండ్‌ సూచించినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ రామ్ కూడా 2015, 2020లో గెలిచిన తన సొంత నియోజకవర్గం నుంచి ఈసారి ఓటమిని చవిచూశారు.

ఈ కీలక సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థ) కేసీ వేణుగోపాల్‌తో పాటు రాజేష్ రామ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను తెలుసుకునేందుకు ది ఫెడరల్ సంప్రదించగా.. రంజన్ స్పందించేందుకు నిరాకరించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. రాజేష్ రామ్ కూడా ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదని సమాచారం.


సీఎల్‌పీ ఎంపికపై..

బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) నాయకుడి ఎంపిక అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ పదవి చాలా కాలంగా ఖాళీగానే ఉంది. రాష్ట్ర నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ అంశంపై తుది నిర్ణయం పూర్తిగా హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని, ఫిబ్రవరి 2న ప్రారంభం కానున్న బీహార్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే CLP పేరును ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.


‘వైఫల్యాలను ప్రశ్నించండి’

బీహార్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యలపై మరింత పోరాటాలకు సిద్ధం కావాలని హైకమాండ్ రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు సమాచారం. నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించింది. వెనుకబడిన, అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలను కూడా కలుపుకొని వెళ్లే రాజకీయ వ్యూహాన్ని అవలంబించాలని పార్టీ మేధావులు సూచించినట్లు తెలుస్తోంది.

Read More
Next Story