దేశ రక్షణ దళాధిపతులుగా బాల్యమిత్రులు
వాళిద్దరూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఇప్పుడు ఒకే రోజు దేశ రక్షణ దళాలకు కమాండర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఒకరు ఆర్మీ చీఫ్గా మరొకరు నావీ చీఫ్గా.
జనరల్ మనోజ్ పాండే పదవీ విరమణ చేయడంతో ఆర్మీ కొత్త చీఫ్గా జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆదివారం (జూన్ 30) బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన ఆర్మీ వైస్-చీఫ్గా పనిచేశారు. ఇక అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకాదళ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు.
దినేష్ త్రిపాఠి, ఉపేంద్ర ద్వివేది 1970లో మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్ లో కలిసి చదువుకున్నారు. 1970లో వీరు 5వ తరగతిలో ఉన్నపుడు వీరి రోల్ నంబర్లు 931, 938.
రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ బాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ‘‘భారత సైనిక చరిత్రలో మొదటిసారిగా నేవీ, ఆర్మీ చీఫ్లు ఒకే పాఠశాల నుంచి వచ్చారు. ఈ అరుదైన గౌరవం రేవాలోని సైనిక్ స్కూల్కు దక్కుతుంది’’ అని పోస్ట్ చేశారు.
1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1984 డిసెంబర్ 15న సైన్యంలో చేరారు. అనంతరం వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్ ఆర్మీ కమాండర్గా సుదీర్ఘ కాలం సేవలు అందించారు.