భగవద్గీతే నన్ను గెలిపించింది: ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత
x

భగవద్గీతే నన్ను గెలిపించింది: ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత

భగవద్గీతలోని శ్రీకృష్ణభగవానుని మాటలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అంటున్నారు ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత 22 ఏళ్ల మనుభాకర్.


కర్మణ్యే వాధికా రస్తే మా ఫలేషు కదాచన ।

మా కర్మ ఫల హేతురభుహ, మాఁ తే సంగోత్స్వ కర్మణ్యే।

తాత్పర్యం..

“నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు; ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు; అలాగని కర్మలు చేయడం మానకు.” ఇవి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి మాటలు.

భగవద్గీతలోని ఈ పదచ్ఛేదమే తనను గెలిపించిందని అంటున్నారు షూటర్ మనుభాకర్. ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. 12 సంవత్సరాల తరువాత భారత్ ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ గా మనుభాకర్ పేరు చరిత్రలో నిలిచిపోనుంది.

"నేను భగవద్గీత చదివాను. మనం విధితో పోరాడలేము. ఫలితాన్ని మీరు నియంత్రించలేరు. ‘కర్మపై దృష్టి పెట్టండి, కర్మ ఫలితంపై కాదు.’ అన్న శ్రీకృష్ణుడు మాటలను మాత్రమే ఆచరణలో పెట్టా. అదే నన్ను గెలిపించింది’’ అన్నారు మను.

"టోక్యో తర్వాత నేను చాలా నిరాశకు గురయ్యాను. దాన్ని అధిగమించడానికి నాకు చాలా సమయం పట్టింది. కాంస్యం గెలిచినందుకు ఆనందంగా ఉంది. దీన్ని గొప్పగా భావిస్తున్నాను. ఈ పతకం రావడానికి దేశానికి చాలా కాలం పట్టింది. ఈ సారి మరింత ప్రదర్శన కనపరుస్తా"నన్నారు.

"ప్రతిసారీ నేను చాలా కష్టపడుతున్నాను. నా స్నేహితులు, బంధువులు శ్రేయోభిలాషులు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నా కోచ్ జస్పాల్ సర్, నా స్పాన్సర్‌లు OGQ కి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను." అని పేర్కొన్నారు మనుభాకర్.

ఎయిర్ పిస్టల్ విభాగంలో కొరియన్లు జిన్ యే ఓహ్ 243.2 పాయింట్లతో స్వర్ణాన్ని , కిమ్ యెజీ 241.3తో రజతం కైవసం చేసుకున్నారు.

భారత్ చివరిసారిగా 2012లో షూటింగ్‌లో ఒలింపిక్ పతకం సాధించింది.

Read More
Next Story