జీఏడీకి వైఎస్సార్‌సీపీ లేఖ
x

జీఏడీకి వైఎస్సార్‌సీపీ లేఖ

మాజీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ను తీసుకుపోవాలని ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖకు వైఎస్సార్‌సీపీ ఐదో లేఖ.


ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌రెడ్డి క్యాంప్‌ ఆఫీస్‌లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి వైఎస్సార్‌సీపీ మరో లేఖ రాసింది. ఈ మేరకు జీఏడీ డిప్యూటీ సెక్రటరీకి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ రాశారు. ఆ ఫర్నీచర్‌ను వెంటనే తీసుకుపోవాలని కోరారు. ఫర్నిచర్‌లో కొన్నింటిని తమ దగ్గరే ఉంచుకునేందుకు అనుమతించాలని, వాటికి విలువ కడితే చెల్లించేందుకు సిద్దంగా ఉన్నామని, మిగిలినవి తీసుకుపోవాలన్నారు.

ఈ విషయమై ఇప్పటికే నాలుగు పర్యాయాలు లేఖ రాశామని ఆయన పేర్కొన్నారు. తొలుత జూన్‌ 15, ఆ తర్వాత జూన్‌ 19, మళ్లీ జూలై 1, తిరిగి జూలై 29న లేఖలు రాసినట్లుగా ఆయన గుర్తు చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యాలయ ఇంఛార్జ్‌ గణేశ్‌ రెడ్డి అనేక పర్యాయాలు ఈ విషయంపై జీఏడీని సంప్రదించిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకునే ఉద్దేశం ఉందా? లేదా? అని లేళ్ల అప్పిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కేవలం నిందలు మోపడానికే, దీనిపై స్పందించడం లేదా? అని ఆయన నిలదీశారు.
ఫర్నీచర్‌ను తీసుకుపోవడం వీలు కాకపోతే, ఎక్కడికి పంపాలో జీఏడీ చెప్పాలని అప్పిరెడ్డి కోరారు. ఒకవేళ ఆ ఫర్నీచర్‌ను వెనక్కు తీసుకోవడం ఇష్టం లేకపోతే, వాటి ఖరీదు చెబితే చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఈ ఫర్నీచర్‌ వల్ల తమ ఆఫీస్‌లో స్థలాభావం నెలకొందని, అందువల్ల ఏ విషయమూ వెంటనే చెప్పాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఆ లేఖలో కోరారు.
Read More
Next Story