
వైసీపీది నిజమైన ఉద్యమం కాదు
ఏపీలో బీజీపీని ఢీ కొట్టే దమ్ము కాంగ్రెస్ పార్టీకే ఉందని షర్మిల అన్నారు.
వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్నవి నిజమైన ఉద్యమాలు కావని, కేవలం ఆ పార్టీ కోసం, జగన్కు పనికొచ్చే ఉద్యమాలు వారు చేస్తారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కాకినాడలో ఆమె మాట్లాడుతూ మరో సారి తన సోదరుడు జగన్, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లాల పర్యటనలు చేస్తూ, సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేసేది కాంగ్రెస్ పార్టీయే అని షర్మిల వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రజల సమస్యల మీద తమ పోరాటాలను ఉధృతం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజీపీని ఎదిరించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉందని, వైసీపీకి కానీ, మాజీ సీఎం జగన్కు కానీ లేదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ల అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వర్గం పోరు, ఆధిపత్యం వంటి అంశాలపైనా ఆమె స్పందించారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో ఎలాంటి అసంతృప్తులు లేవని, వారెవ్వరూ నిరుత్సాహంగా లేరని, కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య కూడా ఎలాంటి వర్గ పోరు కానీ, ఆధిపత్య పోరు కానీ లేదని షర్మిల స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక తాటిపైకొచ్చి కలిసి పని చేస్తున్నామని, నాయకుల మధ్య, కార్యకర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కంచుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహా సముద్రం వంటిదని, పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అంటూ పరోక్షంగా వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఏలూరు, రాజమండ్రి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైనట్లు తెలిపారు.
తాము నిర్వహిస్తున్న జిల్లా సమావేశాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లే విధంగా ఆయా జిల్లా నాయకులు, కార్యకర్తలకు సూచిస్తున్నట్లు షర్మిల తెలిపారు. విభజన సమస్యలు నెరవేరాలన్నా, రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్నా అది కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని, ఇవే అంశాలను ప్రజల్లోకి తీసుకునే వెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నట్లు తెలిపారు.