షర్మిల కొంగుపట్టుకుని ఓట్లు అడుగుతున్నారా?
x

షర్మిల కొంగుపట్టుకుని ఓట్లు అడుగుతున్నారా?

అవినాష్ రెడ్డిపై షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలను వైఎస్ఆర్ సోదరి విమలమ్మ తీవ్రంగా ఖండించారు. వాళ్లు వ్యాఖ్యలు తీవ్ర అన్యాయంగా ఉన్నాయని అన్నారు.


కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ టార్గెట్‌గా ఏపీసీసీ వైఎస్ షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైఎస్ రాజశేకర్ రెడ్డి సోదరి విమలమ్మ ఘాటుగా స్పందించారు. దినమంతా అవినాష్ రెడ్డి హంతకుడు అంటూ అవినాష్‌ను షర్మిల, సునీత బద్నాం చేస్తున్నారని విమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ కుటుంబం పరువును షర్మిల, సునీత కలిసి రోడ్డుకీడుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుతం వైఎస్ షర్మిల.. ఎక్కడికి వెళ్లినా కొంగు పట్టుకుని ఓట్లు అడుగుతోంది. అలా కొంగు పట్టుకుని అడిగితే ఓట్లు పడిపోయి గెలిచేస్తే అక్కడ నాయకత్వ నైపుణ్యం ఏముంది’’అని ఆమె ప్రశ్నించారు. ‘‘వెళ్లిన ప్రతి చోట తాను వైఎస్ బిడ్డను అని షర్మిల చెప్పుకుంటుంది. నిజంగా వైఎస్ఆర్ బతికి ఉంటే ఇలా చేయనిచ్చేవారా’’అని నిలదీశారు.. షర్మిల, సునీత చేస్తున్న పని ససేమిరా తప్పని తీవ్రంగా ఖండించారామే. వైఎస్ఆర్ ఇంటి ఆడబిడ్డలు మాట్లాడుతున్న ప్రతి మాట అన్యాయంగానే ఉందని, వాళ్లలాంటి చిన్న బడ్డ అవినాష్‌ను అదే పనిగా ఆరిపోసుకుంటున్నారని మండిపడ్డారు.
షర్మిల ఆరోపణలు
వైఎస్ వివేకాను హత్య చేయించింది అవినాష్ రెడ్డే అని వైఎస్ షర్మిల మొదటి నుంచి తన ప్రచారంలో ఆరోపిస్తూనే ఉన్నారు. అవినాష్ రెడ్డి నిందుతుడని సీబీఐ తేల్చిందని, కానీ అవినాష్ అరెస్ట్ కాకుండా సీఎం జగన్ కాపాడుతున్నారంటూ దాదాపు ప్రతి సభలో షర్మిల పునరుద్ఘాటించారు. అదే విధంగా సునీత రెడ్డి కూడా రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని ఓడించాలని, హంతకులు చట్టసభల్లోకి వెళ్లకూడదంటూ పిలుపునిచ్చారు. వివేకా కేసులో అవినాష్ హస్తం ఎంత వరకు ఉందో నిరూపించే సాక్ష్యాలు సీబీఐ దగ్గరా ఉన్నా.. జగన్ వాటిని బయటకు రాకుండా అధికారబలంతో అడ్డుకుంటూ అవినాష్‌ను కాపాడుతున్నారని కూడా షర్మిల, సునీత ఆరోపణలు చేశారు.
మీరు చూశారా హత్య చేయడం
వారి ఆరోపణలపై నేడు స్పందించిన విమలమ్మ.. అవినాష్ రెడ్డి హత్య చేయడం వాళ్లు చూశారా అని షర్మిల, సునీతను ఉద్దేశించిన కీలక వ్యాఖ్యలు చేశారు. నోటికివచ్చినట్లు ఆరోపణలు చేస్తూ అవినాష్‌ను అల్లరిపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వివేకాను ఎవరు చంపారో వాళ్లే నిర్ణయిస్తే ఇక కోర్టులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎందుకు. వివేకాను హత్య చేసినవాడు దర్జాగా తిరుగుతుంటే అతని చెప్పిన మాటలు నమ్మి వీళ్లు అవినాష్ రెడ్డిపై ఆరోపణలు చేస్తారా’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకన్నా చిన్నవాడన్న సింపతీ కూడా లేకుండా షర్మిల, సునీత.. అవినాష్ జీవితాన్ని నరకయాతన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకాను ఎవరు చంపారో విమలమ్మకు తెలుసా..!
షర్మిల, సునీత ఆరోపణలను ఖండించిన విమలమ్మ.. వివేకాను హత్య చేసిన వాడు దర్జాగా బయట తిరుగుతుంటే అభంశుభం తెలియని అవినాష్‌ను ఆడిపోసుకుంటున్నారని విమలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త అనుమానాలకు దారి తీస్తున్నాయి. వివేకాను ఎవరు హతమార్చారో విమలమ్మకు తెలుసా? తెలిస్తే ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పటికి కూడా ఆమె ఎందుకు స్పందించడం లేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె మౌనానికి కారణం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. మరి త్వరలోనే ఈ ప్రశ్నలకు కూడా విమలమ్మ సమాధానం చెప్తారేమో చూడాలి.
Read More
Next Story