పవన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్‌ షర్మిల
x

పవన్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ వైఎస్‌ షర్మిల

అధికారంలోకి వచ్చాక పవన్‌ కల్యాణ్‌ మారిపోయాడు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలపట్ల షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


తిరుపతి వారాహి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం అనుకోవద్దని హితవు పలికారు. తిరుపతి సభలో రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకుని వపన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి, ఎట్టి పరిస్థితుల్లోనూ అవి ఆమోదించదగ్గవి కావు అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ తన మత రాజకీయాల్లోకి రాహుల్‌ గాంధీని లాగడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తోందిని షర్మిల మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌ బేషరతుగా రాహుల్‌ గాంధీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు. దేశంలో ప్రేమ, సమానత్వం, సోదరభావం పెంపొందించేందుకు రాహుల్‌ గాంధీ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. అలాంటి వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతమైతే, అదే సిద్ధాంతానికి పవన్‌ కల్యాణ్‌ డబుల్‌ ఏజెంట్‌ గా మారాడని, ప్రధాని మోదీ డైరెక్షన్‌లో యాక్టింగ్‌ చేసే మీకు రాహుల్‌ గాంధీ గురించి మాట్లాడే నైతికత లేదని ధ్వజమెత్తారు. గోద్రా, మణిపూర్‌లో ఊచకోత కోసింది బీజేపీ పార్టీ కాదా? అని నిలదీశారు.
అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వేషం, భాష రెండూ మారి పోయాయన్నారు. లౌకికవాద పార్టీగా ఉన్న జనసేన రైటిస్ట్‌ పార్టీగా మారిందా? అని నిలదీశారు. బాధ్యత కలిగిన పదవిలో ఉంటూ, ఒక మతానికి చెందిన వేషం వేసుకుని, ఆ మతమే ముఖ్యమని మాట్లాడుతుంటే, ఇతర మతాలకు అభద్రతా భావం ఉండదా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇతర మతాల వారు ఓట్లు వేయలేదా? అని ప్రశ్నించారు. ఇతర మతాల వారికి మనోభావాలు ఉండవా? అని నిలదీశారు.
Read More
Next Story