ప్రశ్నిస్తే భూ స్థాపితం చేస్తారా చంద్రబాబు?
x

ప్రశ్నిస్తే భూ స్థాపితం చేస్తారా చంద్రబాబు?

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో పాటు ఎల్లో మీడియ మీద కూడా తాము యుద్ధం చేస్తున్నట్లు మాజీ సీఎం జగన్‌ వెల్లడించారు.


సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని మాజీ ముఖ్యంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఓ టీవీ ఛానెల్‌లో చంద్రబాబు మాటలు చూస్తోంటే ఎంత అహంకారాన్ని తెలియజేస్తున్నాయో అర్థం అవుతుందని జగన్‌ మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిని భూస్థాపితం చేస్తారా చంద్రబాబు? అంటూ జగన్‌ నిలదీశారు. తాడేపల్లి వైసీపీ కేంద్రకార్యాలయంలో గురువారం జగన్‌ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం, అసంతృప్తి పెరిగిందని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

ప్రశ్నిస్తున్న వారిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి ఆందోళనలకు గురిచేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మద్యం కేసులో ఏనాడు పేరు వినపడని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిన దుర్మార్గంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. భాస్కర్‌రెడ్డి గన్‌మెన్‌లను బలవంతం చేసి వారి చేత తప్పుడు స్టేట్‌మెంట్లు తీసుకొని అరెస్టులకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వని గన్‌మెన్‌ తనపై జరిగిన దాడి గురించి రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీలకు లేఖ రాశారని అన్నారు. ఇలా అనేక మంది వైసీపీ నాయకుల మీద అన్యాయంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబు చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చిందన్నారు.
సీఎం చంద్రబాబు పాలన ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపీడీలను కొనసాగిస్తూ అక్రమ పాలనకు కేరాఫ్‌గా మారిందని ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమం గాలికి వదిలేశారని అన్నారు. రూ. 15వేల కోట్లు కరెంటు బిల్లులు బాదుడు పెరిగిందన్నారు. ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రేషన్‌ ఇచ్చే వాహనాలను తొలగించారని, కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్న 3లక్షలపైగా ఉద్యోగాలను తీసేశారని మండిపడ్డారు. పండించిన పంటలకు మద్దతు ధరలు లేక రైతులు అల్లాడి పోతున్నారని అన్నారు. ఉద్యోగస్తుల పీఆర్సీని ఆపేశారని, డీఏలకు ఎగనామం పెట్టారని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్తులను ఎప్పుడూ తాకట్టు పెట్టలేదని, కానీ సీఎం చంద్రబాబు ఏపీఎండీసీ కింద 436 మినరల్‌ ప్రాజెక్టును తాకట్టు పెట్టారని, వాటి విలు రూ. 191,000 కోట్లు ఉంటుందని జగన్‌ వెల్లడించారు. అబద్దాలు చెప్పి నిత్యం ప్రజలను మోసం చేస్తూ పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును తాము ప్రశ్నిస్తూనే ఉంటామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులు సాక్షి కార్యాలయాలే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని, వాస్తవాలు చెప్పకుండా విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అనేది తప్పుడు సంప్రదాయం కాదా? అంటూ నిలదీశారు. సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులు ఓ ప్రణాళిక ప్రకారమే సాక్షి ఆస్తుల మీద దాడులకు తెగబడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఏడాది పాలనలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం పేరుతో తల్లులకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని, దీనిపైన ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి తల్లికి అమ్మ ఒడి ఇచ్చామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆయనే సాటి అని ఎద్దేవా చేశారు.
Read More
Next Story