’మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్‘
x

’మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్‘

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన “అమరజీవి జలధార” కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.


వైఎస్సార్సీపీ మీద, ఆ పార్టీ నాయకుల , శ్రేణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన “అమరజీవి జలధార” కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మళ్లీ మేము అధికారంలోకి వస్తాం.. మీ అంతు చూస్తాం అని కొంతమంది వైసీపీ నాయకులు బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు. పనులు చేస్తే కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు. వారందరికీ ఒకటే చెబుతున్నాం... మీకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంటే కరెక్ట్ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తలుచుకుంటే బలమైన నక్సలిజమే కకావికలం అయిపోయింది. ఇలా బెదిరింపులకు దిగే కిరాయి రౌడీలకు ప్రభుత్వం బలమైన పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని హెచ్చరించారు.

అమరజీవి జలధార” ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2027 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అని పవన్ కల్యాణ్ తెలిపారు.

తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం అమరుడైన శ్రీ పొట్టి శ్రీరాములు సదా స్మరించుకోవాలనే ఉద్దేశంతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు “అమరజీవి జలధార”గా నామకరణం చేశాం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది.
ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం చాలా సహజం. ఆ విమర్శలు నిర్మాణాత్మకమైన విమర్శలుగా ఉండాలి అంతే తప్పితే గీతదాటి మాట్లాడతాం అంటే చేతిలో గీతలు మాయమయ్యేలా చేస్తాం. కొంతమంది నాయకులు ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పిఠాపురంలో చిన్న పిల్లల మధ్య సామాజికవర్గాల పేరిట చిచ్చు పెట్టారు. అన్నం తినేవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? రాజకీయం చేయడానికి వేరే దారులే లేవా? ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గుండాలి అని మండిపడ్డారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను తగ్గాను కనుకే పల్లెపండగ 1.0 కార్యక్రమం చేయగలిగాం. 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయగలిగాం. లక్ష ఫామ్ పాండ్లు, 22,500 మినీ గోకులాలు నిర్మించగలిగాం. 10 వేల ఎకరాల ఉద్యానవన పంటలకు చేయూత ఇవ్వగలిగాం. నేను తగ్గి రాష్ట్రాన్ని పెంచాను కనుకే ఈ రోజు ఈ అభివృద్ధి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2024లో జల్ జీవన్ మిషన్ గడువు ముగిసేనాటికి ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉపయోగపడాల్సిన వేల కోట్ల నిధులు నిరుపయోగంగా మిగిలిపోయాయి. పథకం గడువు ముగియడంతో ఆ నిధులు మురిగిపోయాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నేను ఢిల్లీ వెళ్లి కేంద్రంలో ఉన్న పెద్దలతో చర్చించాం. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు గడువు పొడిగించేందుకు ఒప్పించాం.
ఈ రోజు రాష్ట్రానికి ఇన్ని వేల కోట్లు తీసుకువస్తున్నామంటే దానికి కారణం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన సంపూర్ణ సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. రోడ్ల నిర్మాణంలో గానీ, అమరజీవి జలధార కార్యక్రమం ద్వారా జరుగుతున్న పనుల్లో కానీ నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.
Read More
Next Story