
యోగా డే వేడుకలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
యోగాను 'ఒలింపిక్స్'లో చేర్చాలి..
ప్రధాని వల్లే యోగా అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కులమతాలు, ప్రాంతీయ బేధాలకతీతంగా యోగా ఆమోదం పొందిందని వ్యాఖ్యానించారు.
ఒలింపిక్స్ గేమ్స్తో పాటు ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ యోగాను చేర్చేలా ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. శనివారం ఉదయం విశాఖలో జరిగిన అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రధాని వల్లే యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యం లభించిందని, కులమతాలు, ప్రాంతాలు, దేశాలు, భాషా బేధాలకతీతంగా ఆమోదం పొందిందని, ఉద్యమంగానూ మారిందని చెప్పారు. ఇంకా ఆయనేమన్నారంటే?
వేదికపై ప్రధాని మోదీతో ముచ్చటిస్తున్న చంద్రబాబు, పక్కన గవర్నర్ నజీర్
‘యోగా మనందరి జీవితాల్లోనూ భాగస్వామ్యం కావాలి. ప్రజలు ప్రతి రోజూ ఒక గంట యోగా కోసం సమయాన్ని కేటాయించాలి. డిజిటల్ ప్రపంచంలో క్రమశిక్ష; సృజనాత్మకతలు పెంచుకోవడానికి యోగా ఉపకరిస్తుంది. వ్యాయామంగానే కాకుండా శక్తివంతమైన సాధనంగానూ ఆచరిద్దాం. యోగాతో సంతోషకరమైన సమాజం ఏర్పడుతుంది. హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విజన్ స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికను రూపొందించాం. ప్రధాని ప్రోత్సాహంతో యోగా, ప్రకృతి చికిత్స, ఆయుర్వేదం, గ్రీన్ ఎన ర్జీ, స్వచ్ఛభారత్, ప్రకృతి వ్యవసాయం వంటివి పునరుద్ధరణ సాధ్యమైంది. మోదీ విజన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకర సమాజానికి మార్గం సుగమం అయింది. యోగా డేలో పాల్గొన్న వారంతా చారిత్రాత్మకమైన కార్యక్రమంలో భాగస్వాములైనట్టే. నెల రోజుల పాటు తెలుగు ప్రజలు ఒక దీక్షలా, ఒక ఉద్యమంలా యోగా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. సత్తా చాటారు. యోగాంధ్ర కార్యక్రమం ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ప్రధాని ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని ఆచరించి జీవన విధానంగా మార్చుకుని అందరిలో చైతన్యాన్ని తీసుకొస్తాం. తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. యోగాంధ్ర కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ప్రధాని మోదీ స్ఫూర్తితో నెల రోజులు యోగాంధ్ర ప్రచారాన్ని నిర్వహించాం. ఇందులో 1.44 లక్షల మంది యోగా శిక్షకులకు శిక్షణ ఇచ్చాం. 1.40 లక్షలకు పైగా ప్రాంతాల్లో 2.17 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొన్నారు. విశాఖలో ఒకే ప్రదేశంలో మూడు లక్షల మందికి పైగా హాజరయ్యారు. శుక్రవారం 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలుచేసి గిన్నిస్ రికార్డు సాధించడం మనందరికీ గర్వకారణం’ అని వివరించారు. అనంతరం చంద్రబాబు ప్రధాని మోదీని దుశ్శాలువతో సత్కరించారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి జ్ఞాపికను బహూకరించారు.
యోగా డే వేడుకలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వారిద్దరి వల్లే ప్రపంచ రికార్డు : పవన్ కల్యాణ్యోగా డే వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుల వల్లే యోగాపై ప్రపంచ రికార్డు సాధ్యమైందన్నారు. ‘యోగా గురించి రుగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే .. దానిని ప్రపంచానికి తెలియజేసిన దార్శనికుడు మోదీ. సనాతన భారతీయ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఒత్తిడిని యోగా ద్వారా ఎలా అధిగమిస్తారో తెలియజెప్పారు మోదీ. యోగా అంశాన్ని 2014లో ఐక్యరాజ్య సమితిలో మోదీ ప్రవేశపెట్టినప్పుడు 175 దేశాలు మద్దతు పలికాయి. 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. యోగా విద్యనందించిన ఆదియోగి, పతంజలిలకు నమస్సులు తెలియజేస్తున్నానన్నారు. ఇక్కడకు విచ్చేసిన అందరికీ హృదయపూర్వక వందనాలు’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. అంతకు ముందు కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ యోగా విశిష్టత, ప్రధాని కృషిని వివరించారు. ఈ యోగా డే కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయులు, వంగలపూడి అనిత, ఎంపీలు పురందేశ్వరి, శ్రీభరత్, ఎమ్మల్యేలు పాల్గొన్నారు.
Next Story