ఎల్లో మీడియా దారుణ దుష్ప్రచారం: సజ్జల విమర్శలు
x

ఎల్లో మీడియా దారుణ దుష్ప్రచారం: సజ్జల విమర్శలు

వైఎస్‌ఆర్‌సీపీపైన, ఆ పార్టీ నేతలపైన, మాజీ సీఎం జగన్‌పైన సీఎం చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. కావాలనే ఇబ్బందులు పెడుతోందని సజ్జల విమర్శలు చేశారు.


వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పైన, మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురి చేస్తోందని ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. బుధవారం తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 15 నుంచి ఎల్లో మీడియా నాపై అదే పనిగా దుష్ప్రచారం చేస్తోంది. నేను విదేశాల నుంచి వస్తుంటే, నన్ను విమానాశ్రయంలో ఆపితే.. నేను నేరం చేసి పారిపోతుంటే ఆపినట్లు వారి పైత్యమంతా ఒలకపోస్తున్నారు. డిబేట్లలో దారుణంగా చర్చిస్తున్నారు. వారికి మీడియాలో బలం ఉంది కాబట్టి, ఏ అబద్దాన్ని అయినా ప్రచారం చేయొచ్చని అలా చేస్తున్నారని మండిపడ్డారు.

అకారణంగా ఆపారు
నేను, నా కుటుంబంతో ఈనెల 7న ఢిల్లీ నుంచి బాలి వెళ్లి, 14వ తేదీన తిరిగి వచ్చాను. ఢిల్లీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3.30కి ల్యాండ్‌ అయ్యాను. 6 గంటలకు విజయవాడ ఫ్లైట్‌ క్యాచ్‌ చేయాల్సి ఉంది. అక్కడ నన్ను ఇమ్మిగ్రేషన్‌ వాళ్లు ఆపారు. కారణం మాత్రం చెప్పలేదు. తమకు గుంటూరు ఎస్పీ నుంచి లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) వచ్చిందని చెప్పారు. నేను విదేశాలకు వెళ్లడం లేదని, తిరిగి వస్తున్నానని, ఇప్పుడు కూడా విజయవాడకే వెళ్తున్నానని చెప్పినా, తామేం చేయలేమన్నారు. అది వేధింపు తప్ప, మరేదీ కాదు. ఈనెల 25వరకు ఏ చర్య తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పడంతో, మోడిఫికేషన్‌ చేశారు. దాంతో ఆరోజు ఫ్లైట్‌ మిస్‌ అయి, మర్నాడు ఉదయం ఫ్లైట్‌కు విజయవాడ వచ్చానని చెప్పారు. ఇంత దారుణ వేధింపా? చట్టం అనేది ఒకటి ఉంటుంది కదా? అధికారం ఉండొచ్చు. కేసులు పెట్టొచ్చు. కానీ కోర్టులు అనేవి ఉన్నాయి కదా? మేము కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. మాకు కోర్టులపై విశ్వాసం ఉంది.
పోలీసు వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 15న గుంటూరు ఎస్పీ నుంచి ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు లెటర్‌ వచ్చింది. అందులో నన్ను ఆపాల్సిన అవసరం లేదని రాశారు. నేను బాలి వెళ్లింది ఈనెల 7న అయితే, నాపై లుక్‌ అవుట్‌ నోటీస్‌ను ఈనెల 10న ఇచ్చారు. అంటే నేను వెళ్లినట్లు తెలుసుకుని ఆ నోటీసు ఇచ్చారేమో? అయినా నాపై ఎల్లో మీడియాలో పిచ్చిపిచ్చిగా విమర్శలు. వ్యాఖ్యలు. ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
పారిపోవాల్సిన అవసరం లేదు
నేను పారిపోతుంటే పట్టుకున్నారని ఆరోపణలు చేశారు. అసలు మేమెందుకు పారిపోతాం. ఏం తప్పు చేశామని? మాపై మీరు తప్పుడు కేసు పెట్టారు. నాడు మీమీద కేసులు పెట్టారంటే, అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా మీ పెండ్యాల శ్రీనివాస్‌ నోటీస్‌ తీసుకుని విదేశాలకు పారిపోయారు. చంద్రబాబు అరెస్టు కూడా కక్ష సాధింపుతో జరగలేదు. సిట్‌ దర్యాప్తు తర్వాత పక్కా ఆధారాలతోనే ఆయన్ను అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడుపై కేసు కూడా అంతే. అన్ని ఆధారాలతోనే ఆయన్ను అరెస్టు చేశారు. మేము ఏ తప్పూ చేయలేదు. మీ పార్టీ ఆఫీస్‌ మీద దాడి ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగింది. అది కూడా ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు. అయినా, అంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారు. ఎందుకంత నీచంగా వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారని అన్నారు.
హైకోర్టు ప్రొటెక్షన్‌ లో ఉన్నా...
ఆ కేసులో నన్ను ఎక్కడో 131వ నిందితునిగా చేర్చారు. కేసులో నాపేరు నమోదు చేయడంతో, కోర్టును ఆశ్రయిస్తే, సెప్టెంబరు 20న హైకోర్టు ఆదేశం ఇచ్చింది. అక్టోబరు 25 వరకు నాపై ఏ చర్య తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. మరి అంత క్లియర్‌గా ఆదేశాలు ఉంటే, నేను విదేశాలకు వెళ్లి, తిరిగి వస్తుంటే, ఆపడం ఏంటి? కోర్టు డైరెక్షన్‌ వచ్చిన తర్వాత 17 రోజులకు నేను విదేశాలకు వెళ్లి, 24 రోజుల తర్వాత తిరిగి వస్తుంటే, ఎల్‌ఓసీ పేరుతో ఆపడం ఏమిటి? మరోవైపు ఎల్లో మీడియాలో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శలు చేయడం అత్యంత హేయం. ఆ ఛానళ్లలో గతి తప్పిన పిచ్చి చర్చలు. విమర్శలు, వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేదే లేదు. అంతా గుండా రాజ్యం. లోకేష్‌ చెప్పినట్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. పోలీసుల వ్యవహారం అలా ఉంటే, ఛానళ్లలో పిచ్చి డిస్కషన్స్‌ చేస్తూ, అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం
సోమవారం చూశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఈడీ ఆస్తులు అటాచ్‌ చేస్తే.. ఈడీ చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. ఏమైనా కామన్‌సెన్స్‌ ఉందా? అక్కడ స్కామ్‌ జరిగింది కాబట్టే, ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది. ఆస్తుల అటాచ్‌మెంట్‌ జరుగుతోంది. ఆ కేసు అంత క్లియర్‌గా ఎస్టాబ్లిష్‌ చేస్తుంటే, చంద్రబాబుకు క్లీన్‌చిట్‌ ఇస్తూ, తమ మీడియాలో రాయిస్తున్నారు. చంద్రబాబు నేరం చేశాడు కాబట్టే, ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. అయినా దాన్ని క్లీన్‌చిట్‌ అని సిగ్గు లేకుండా రాస్తున్నారు. అలా జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
అంతా టార్గెట్‌ ప్రకారమే..
అంటే, వారు టార్గెట్‌ చేసుకున్న వారిని ఎలాగోలా కేసులో ఇరికించేందుకు.. ఎవరినో పట్టుకురావడం, ఏదేదో చెప్పించడం అలవాటుగా మారింది. ముంబై నటిని తీసుకొచ్చి ఎవరెవరి పేర్లో చెప్పించారు. నిజానికి టీడీపీ ఆఫీస్‌ మీద దాడి ఘటనలో అసలు కేసే లేకపోతే, దాన్ని ఇప్పుడు సీఐడీకి అప్పగిస్తారట. చూస్తుంటే దాన్ని దేశద్రోహం కేసుగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2024 ఎన్నికలకు ముందు మీడియాను అడ్డుపెట్టుకుని ఎలా రాజకీయాలు చేశారో.. ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా, అదే మీడియా సహకారంతో, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, తప్పుడు కేసులు పెడుతున్నారు. వేధిస్తున్నారు. జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దాంట్లో భాగంగానే, నాపై ఎల్‌ఓసీ ఉందని, నన్ను విమానాశ్రయంలో ఆపారు. ప్రజలు అన్నీ గమనించాలి. ఈ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయదు. అలా చేస్తుందని కూడా అనుకోవడానికి లేదు. కేవలం వేధింపులు, దాడులు మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తోందిని పేర్కొన్నారు.
అదే వారి లక్ష్యం, ఉద్దేశం..
టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో అసలు కేసు పెట్టడానికి అవకాశం కూడా లేదు. కానీ వారి ఉద్దేశం మమ్మల్ని వేధించడం. భయ భ్రాంతులకు గురి చేయడం. మా పార్టీ నాయకులు ప్రజల్లో తిరగొద్దు. అసలు మా పార్టీనే ఉండొద్దు అన్నది వారి కుట్ర, కుతంత్రం. అందుకే ఇవన్నీ చేస్తున్నారని అన్నారు. మొన్న చూశారు కదా! బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టే కుట్ర చేశామని కూడా కేసు పెట్టారు. ఎవరెవరినో తీసుకొచ్చి లోపల వేశారు. వారితో ఎవరెవరి పేర్లో చెప్పించి, కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? కోర్టు ప్రొటెక్షన్‌ ఉంది కాబట్టి నన్ను ఎయిర్‌ పోర్టు నుంచి వదిలేశారు. అందుకే ఇవన్నీ కక్ష సాధింపు, వేధింపులు తప్ప, మరొకటి కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
Read More
Next Story