
హోరెత్తిన వైసీపీ ‘వెన్నుపోటు దినం’ నిరసనలు
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు, సీఐ వెంకటేశ్వర్లుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తాయి. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిరసన ర్యాలీలు చేపడుతూనే ఉన్నారు. ఆయా జిల్లా అధికారులకు వినతి పత్రాలు నమర్పించారు.
కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 4 బుధవారంతో ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా ఎన్నికల్లో కూటమి వర్గాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, అబద్దపు హామీలతో ఓట్టేంచుకుని ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, జూన్ 4ను వెన్నుపోటు దినంగా పేర్కొంటూ.. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు చేపట్టాలని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాలను చేపట్టారు.
మాజీ మంత్రి కన్నబాబు నేతృత్వంలో కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలులో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డిల ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కడప జిల్లా కమలాపురంలో వైసీపీ నాయకుడు రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి పెద్దరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి ఆధ్వర్యంలో వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
గుంటూరులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీను ఆపేస్తామని సీఐ అంటే.. ఆపు చూద్దామని అంబటి అన్నారు. ఇద్దరు పరస్పరం వార్నింగ్లు ఇచ్చుకున్నారు. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వెన్నుపోటు దినం కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని ప్రకటించారు.
Next Story