
వైసీపీ వాళ్లు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి
ప్రజలను వేధించిన సైకో నేత జగన్కు ప్రజలు చాచి కొట్టినట్లు బుద్ది చెప్పారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేధించిన సైకో నాయకుడు జగన్కు గత ఎన్నికల్లో ప్రజలు చాచి కొట్టి బుద్ది చెప్పారని ధ్వజమెత్తారు. జూన్ నాలుగున వెన్నుపోటు దినం పేరుతో డ్రామాలకు తెరతీయడం కాదని, గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన మోసాలకు వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజానికి ప్రాయశ్చిత్తం చేసుకోవలని మంత్రి అనగాని సత్యప్రసాద్ హితువు పలికారు.
మంగళవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ.. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ జూన్ 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంపై తీవ్రంగా స్పందించారు. 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీని ఓడించి కూటమికి అధికారం ఇచ్చారని, 2024 ఎన్నికల్లో ఓడిపోయినందుకు జూన్ 4న పశ్చాత్తాప దినంగా జరుపుకోవాలని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న మేలును చూసి వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ జగన్మోహన్రెడ్డిలు చూస్తూ ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. అందుకే వైఎస్ఆర్సీపీకి ఉన్న అలవాటు ప్రకారం అబద్దాల ప్రచారాలకు తెరతీశారని ధ్వజమెత్తారు.