వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఇష్టమొచ్చినట్లు కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులు పెడుతూ.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన స్థానిక సంస్థల నేతలతో జగన్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్కాంగ్రెస్ శ్రేణుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్న వారికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని జగన్ హెచ్చరించారు. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న వారి పేరు మీ ఇష్టం వచ్చిన బుక్లో రాసిపెట్టుకోండని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని, పల్నాడు జిల్లాలో అన్యాయంగా పిన్నెల్లి సోదరులపై కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో హత్యలు జరిగాయని, ఆ హత్యలకు ఉపయోగించిన వాహనాలు కూడా ఎవరివో తెలుసని, హత్యలకు పాల్పడిన వాళ్లు కూడా తెలుసని, టీడీపీ వర్గాల గొడవలే ఈ హత్యలకు కారణమని కూడా తెలుసని, దీనిని ఆ జిల్లా ఎస్పీనే స్వయంగా చెప్పారని, అయితే వాటిని పక్కన పెట్టి వైసీపీ నాయకులు పిన్నెల్లి సోదరులపై అన్యాయంగా కేసులు పెట్టారని జగన్ మండిపడ్డారు.
అదేమాదిరిగా నెల్లూరు జిల్లా వైసీపీ నాయకుడు కాకాణి గోవర్థన్రెడ్డి మీద కూడా దుర్మార్గంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ జరగలేదని అధికారులు రిపోర్టులు ఇచ్చినా.. కాకాణి గోవర్థన్రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద కేసులు పెడుతున్నారని, ఆంధ్రప్రదేశ్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయని, రాజ్యాంగం, చట్టం ఉల్లంఘనకు పాల్పడుతోందని కూటమి ప్రభుత్వంపై జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో వైసీపీకి చెందిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, 2.0లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుందని, వారి బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అరాచకాలకు భయపడాల్సిన పని లేదని, వైసీపీ శ్రేణులపై అన్యాయంగా ప్రవర్తించే వారిని వదిలే ప్రసక్తి లేదని జగన్ పేర్కొన్నారు.