
నదుల నీటి వాడకంపై తెలంగాణ సీఎంను చంద్రబాబు ఒప్పిస్తారా?
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి నీటిని వాడుకునే విషయంలో ఎందుకు గొడవపడుతున్నాయి? ముఖ్యమంత్రులు ఇద్దరూ గురు, శిశ్యులు.
కృష్ణా, గోదావరి నదుల్లోని నీరు వాడుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం రాజీ ధోరణిలో ముందుకు వెళుతోంది. దీని వల్ల జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడే అవకాశం లేదా? అక్కడి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ప్రాజెక్టుల నిర్మాణం, సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటి వాడకంపై ఎందుకు చంద్రబాబు మాట్లాడటం లేదు? రేవంత్ రెడ్డి 2014 వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు. చంద్రబాబు పత్రికల వారితో రాజీధోరణి చెబితే అమలులోకి వస్తుందా? అనే ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి.
నేను ఎప్పుడైనా తెలంగాణపై గొడవపడ్డానా? నదుల్లో నీటి వాడకంపై సమస్య సృష్టించడం ఎందుకు? సముద్రంలో కలిసే నీటిని ఎవరికి కావాల్సినంత వారు వాడుకుందాం అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. మనం మనం కొట్టుకుంటే ఎవరికి లాభం? ఏపీ, తెలంగాణ ఎవరి శక్తిమేరకు వారు ప్రాజెక్టులు కట్టుకుందాం. కొత్త ట్రిబ్యునల్ వచ్చాక కేటాయింపుల్లో ఏమేరకు ముందుకెళ్లాలనేది ఆలోచిద్దాం అంటూ తెలంగాణ సీఎం ను సముదాయించే మాటలు చంద్రబాబు ఏపీ సచివాలయంలో విలేకరులతో అన్నారు.
కాళేశ్వరంపై నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదంటూ మాట్లాడిన మాటలు రాష్ట్రంలో చర్చనియాంశంగా మారాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మాటలు వింటారా? వింటే తెలంగాణ నేతలు, ప్రజలు అంగీకరిస్తారా? అనే చర్చ కూడా మొదలైంది. గోదావరి, కృష్ణా నదుల నీటి వాడకంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తీవ్రమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నకచర్ల ప్రాజెక్ట్ను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపిస్తూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రితో సహా వివిధ వేదికలపై పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు తాజాగా సహకార ధోరణిని ప్రోత్సహిస్తూ, నదీ జలాల వాడకంపై గొడవలు అనవసరమని, సముద్రంలో కలిసే నీటిని రెండు రాష్ట్రాలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే...
సీఎం చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలలో రెండు రాష్ట్రాల మధ్య సామరస్యాన్ని నొక్కి చెప్పారు. నేను ఎప్పుడూ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై కూడా అభ్యంతరం లేవనెత్తలేదు.
సముద్రంలో వృథాగా పోయే నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు. ఒకరిపై ఒకరు గొడవపడితే ఎవరికి లాభం?
ఏపీ, తెలంగాణ ఎవరి శక్తిమేరకు వారు ప్రాజెక్టులు కట్టుకోవచ్చు. కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులపై చర్చించవచ్చు.
ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య సంఘర్షణను తగ్గించి, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనను సూచిస్తున్నాయి. అయితే ఈ సహకార ధోరణి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, రాష్ట్ర నేతలను, ప్రజలను ఒప్పించగలదా అనేది ప్రశ్నార్థకం.
రేవంత్ వాదన ఎలా ఉందంటే...
గోదావరిలో 968 టీఎంసీ, కృష్ణాలో 580 టీఎంసీ నీటిని తెలంగాణ వినియోగించుకోవడానికి ఏపీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వాలి. అప్పుడు ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్కు తెలంగాణ అడ్డు చెప్పదు.
భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం గతంలో నీటి వాడకంపై ఏపీతో చేసుకున్న ఒప్పందాలు తెలంగాణకు నష్టదాయకమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2016లో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి సీఎం కేసీఆర్ 3,000 టీఎంసీ గోదావరి నీరు సముద్రంలో వృథాగా పోతుందని, దానిని రాయలసీమకు మళ్లించవచ్చని ప్రతిపాదించారని రేవంత్ ఆరోపించారు.
రేవంత్ రెడ్డి జూన్ 19, 2025న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమై, బనకచర్ల ప్రాజెక్ట్కు ముందస్తు అనుమతులు రద్దు చేయాలని కోరారు. అలాగే ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింక్ను కేంద్ర నిధులతో చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని సూచించారు.
రేవంత్ రెడ్డి ధోరణి చంద్రబాబు సహకార ప్రతిపాదనలను సులభంగా అంగీకరించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ నీటి హక్కులపై దృఢమైన రాజకీయ వైఖరి అవలంబిస్తున్నారు.
బీఆర్ఎస్ ను ఎదుర్కొనే వ్యూహం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ (GWDT-1980) ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం (2014) ఉల్లంఘన అని ఆరోపించారు. రేవంత్ రెడ్ది కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే బాధ్యత ఉంది. బనకచర్ల ప్రాజెక్ట్పై ఆయన దృఢమైన వైఖరి, BRS విమర్శలను ఎదుర్కొనేందుకు, తెలంగాణ రైతుల మద్దతు కొనసాగించేందుకు రాజకీయ వ్యూహంగా ఉంది. చంద్రబాబు సహకార ప్రతిపాదనను అంగీకరించడం రేవంత్కు రాజకీయంగా నష్టదాయకం కావచ్చు.
తెలంగాణ సీఎం రేవంత్ గతంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధం ఉన్నప్పటికీ (రేవంత్ 2009-2014లో TDPలో ఉన్నారు) ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడిగా తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించడం ఆయనకు ప్రాధాన్యత. 2024లో చంద్రబాబు ఏపీ సీఎంగా ఎన్నికైనప్పుడు రేవంత్ సహకార ధోరణిని సూచించినప్పటికీ, నీటి వాడకం విషయంలో ఆయన దృఢంగా ఉన్నారు.
తెలంగాణ నేతల స్పందన
BRS వ్యతిరేఖత: BRS నేత హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చంద్రబాబుతో సహకరించడం తెలంగాణ నీటి హక్కులను రాజీ చేయడమేనని ఆరోపిస్తున్నారు. రేవంత్ గోదావరిలో 1,256 టీఎంసీ, కృష్ణాలో 580 టీఎంసీ నీటిని వినియోగించుకోవడానికి ఏపీ నుండి NOC కోరడం బనకచర్ల ప్రాజెక్ట్కు పరోక్షంగా ఆమోదం ఇవ్వడమేనని విమర్శించారు.
ఇతర పార్టీలు: కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం నేతలు బనకచర్ల ప్రాజెక్ట్పై జరిగిన సమావేశంలో రేవంత్ వైఖరికి మద్దతు ఇచ్చినప్పటికీ, చంద్రబాబు సహకార ప్రతిపాదనలపై స్పష్టమైన స్పందన లేదు. BRS ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమావేశంలో రేవంత వ్యాఖ్యలను రాజకీయంగా ఉపయోగించారని ఆరోపించారు.
ప్రజల స్పందన
తెలంగాణలో నీటి వాడకం రాజకీయంగా సున్నితమైన అంశం. రైతులు, సామాన్య ప్రజలు తమ రాష్ట్ర హక్కులను కాపాడాలని డిమండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో BRS నేతలు రేవంత్ను చంద్రబాబుకు "దాసోహం" అంటున్నారని, తెలంగాణ నీటిని "దోచుకుంటున్నారు" అని ఆరోపిస్తూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
చంద్రబాబు సూచనలు ఏమవుతాయో?
చంద్రబాబు నాయుడు సహకార ధోరణి, సముద్రంలో కలిసే నీటిని రెండు రాష్ట్రాలు వినియోగించుకోవాలనే ప్రతిపాదన ఆదర్శవంతంగా కనిపించినప్పటికీ, రేవంత్ రెడ్డి దానిని అంగీకరించే అవకాశం తక్కువ అనే చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ నీటి హక్కులపై దృఢమైన వైఖరి, రాజకీయ ఒత్తిడి, ప్రజల సెంటిమెంట్ ఆయనను చంద్రబాబు ప్రతిపాదనను తిరస్కరించేలా చేయవచ్చు. అయితే రేవంత్ చట్టపరమైన, రాజకీయ పోరాటం కొనసాగిస్తూ, తెలంగాణకు నీటి వాటా హామీ అయిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులకు సహకరించే అవకాశం ఉంది.