
ఏబీ వెంకటేశ్వరావు ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తారా?
"జగన్ నెవర్ అగైన్" పేరుతో పోరాటం ప్రారంభించిన మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరావు
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుల తరపున పోరాట బాట పట్టారు. జగన్ బాధితులైన కోడికత్తి శ్రీను, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఎన్నికల ప్రచారంలో జగన్పై రాయి దాడి ఆరోపణలు ఎదుర్కొన్న సతీష్, పెద్ద దుర్గారావులను ఇటీవల కలిసి వారి కేసుల వివరాలను తెలుసుకున్నారు. సింగ్ నగర్ కేసులో సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టులు, థర్డ్ డిగ్రీ వంటి అన్యాయ చర్యలు జరిగాయని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యక్తుల తరఫున న్యాయస్థానాల ద్వారా, ప్రభుత్వం నుంచి న్యాయం కోసం పోరాడతానని హామీ ఇచ్చారు.
ఏబీ వెంకటేశ్వరరావు పోరాటం దశ
2025 ఏప్రిల్ నుంచి "జగన్ నెవర్ అగైన్" పేరుతో ప్రజా ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమం ద్వారా జగన్ హయాంలో జరిగిన అన్యాయాలను, అవినీతిని బహిర్గతం చేయడం, బాధితులకు న్యాయం అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నారు. కోడికత్తి శ్రీను దాదాపు ఆరేళ్లు బెయిల్ లేకుండా జైలులో ఉన్నారని, ఇది జగన్ పాలనలో దళిత యువకుడిపై జరిగిన అన్యాయానికి ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. సతీష్, దుర్గారావు కేసుల్లోనూ సాక్ష్యాలు లేకుండా జైలు శిక్ష, థర్డ్ డిగ్రీ వేధింపులు జరిగాయని ఆరోపించారు. ఈ కేసులు ప్రస్తుతం కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి.
ఏబీ వెంకటేశ్వరరావు జగన్ బాధితుల కోసం న్యాయవాదులను నియమించి, కేసులను పునర్విచారణకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. జగన్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమ ఆర్థిక సామ్రాజ్యం గురించి బహిర్గతం చేస్తానని, ప్రజల డబ్బును తిరిగి స్వాధీనం చేసేందుకు చట్టపరమైన పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈ ఉద్యమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జగన్ బాధితులను ఏకం చేసి, వారి సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇటీవల జరిగిన ఒక ప్రజావేదిక సభలో పాల్గొన్న ఏబీ వెంకటేశ్వరరావు
ప్రజా వేదికలకు హాజరు
ఏబీ వెంకటేశ్వరావు పలు ఉద్యమ సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. కమ్మ సామాజిక వర్గం ఇటీవల విజయవాడలో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశానికి హాజరై మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులపై ఇటీవల విజయవాడలోని హోటల్ ఐలాపురంలో జరిగిన సదస్సులో పాల్గొని ఉపన్యసించారు. ప్రాజెక్టులపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. భవిష్యత్ తరాలకు ప్రాజెక్టులు ఎంత అవసరమో చెప్పారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు.
పోలీసు అరాచకాలపై ఖండన
గత జగన్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ కొన్ని పోలీసు అరాచకాలను తీవ్రంగా ఖండించారు. తెనాలిలో యువకులపై పోలీసు దాడి, సతీష్, దుర్గారావు కేసుల్లో థర్డ్ డిగ్రీ వంటి చర్యలను ఆయన ఎండగట్టారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జగన్ ప్రభుత్వంలో తనపైనా అన్యాయమైన సస్పెన్షన్ విధించారని, కోర్టుల ద్వారా న్యాయం పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
రాజకీయ ప్రవేశం
2025 ఏప్రిల్ 13న ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించినట్లు ప్రకటించారు. అమలాపురంలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అన్యాయాలను బహిర్గతం చేస్తానని, "జగన్ నెవర్ అగైన్" ఉద్యమంతో ప్రజలను చైతన్యం చేస్తానని పేర్కొన్నారు. అయితే ఆయన ఏ రాజకీయ పక్షంతో జతకట్టలేదు. తెలుగుదేశం పార్టీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, రాజకీయంగా ఏ పార్టీలో చేరతారనే దానిపై స్పష్టత లేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయన జగన్ హయాంలో కమ్మ సామాజిక వర్గం జగన్ బాధితులుగా మారారని ఒక సందర్భంలో విజయవాడలో అన్నారు. తాను పార్టీ పెడతానని కూడా ఒక దశలో ప్రకటించారు. ఆ తరువాత ఆ విషయం మాట్లాడలేదు.
ఏబీ వెంకటేశ్వరరావు గతంలో జగన్ ప్రభుత్వంలో రెండు సార్లు సస్పెన్షన్కు గురై, అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్ విధించగా, ఆయన కోర్టుల ద్వారా పోరాటం చేసి ఉపశమనం పొందారు. ప్రస్తుతం ఆయన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గజమాల దెబ్బను రాయి దాడిగా చిత్రీకరించారని, ఈ కేసును క్లోజ్ చేయాలని ఆయన ఇటీవల మీడియా ద్వారా పేర్కొన్నారు.
న్యాయశాస్త్రంపై పట్టుకు ప్రయత్నం
న్యాయ శాస్త్రంల్ పట్టు సాధించేందుకు ఆయన న్యాయ విద్యను అభ్యసించనున్నారు. ఈ మేరకు గురువారం జరిగిన లాసెట్ పరీక్షకు హాజరయ్యారు. ఒంగోలుకు సమీపంలోని వల్లూరు వద్ద ఉన్న రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో లాసెట్ పరీక్ష రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ శాస్త్రం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందుకే తాను లాసెట్ రాసినట్లు చెప్పారు.
రాజకీయంగా ఆయన భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయ డైనమిక్స్, ఆయన ఉద్యమం ప్రజల్లో స్పందన, టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలతో భవిష్యత్ సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. జగన్పై పోరాటం, అన్యాయానికి గురైన వ్యక్తులకు న్యాయం అందించే లక్ష్యం ఆయన రాజకీయ ప్రవేశానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ఆయన ఏ స్థానంలో ఉంటారు, ఎలాంటి పాత్ర పోషిస్తారనేది ఇంకా స్పష్టం చేయలేదు.
హేమా హేమీలు మట్టికరిచారు: ఎస్ కే బాబు
చాలా మంది ఐపీఎస్ లు, ఐఏఎస్ లు ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు స్థాపించి ఫెయిల్ అయ్యారని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర నాయకులు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే బాబు అన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ జయప్రకాష్ నారాయణ తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి ‘లోక్ సత్తా పార్టీ’ స్థాపించి ఫెయిల్ అయ్యారు. ఐపీఎస్ లక్ష్మీనారాయణ ‘జై భారత్ నేషనల్ పార్టీ’ పెట్టి ఫెయిల్ అయ్యారు. గత ఎన్నికల్లో ఐఏఎస్ జి ఎస్ఆర్ కేఆర్ విజయకుమార్ ‘లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ’ని స్థాపించి పోటీ చేస్తే ఏమైందని అన్నారు. ఒక జిల్లాలో ఉద్యోగం చేసినంత మాత్రాన వీరు ప్రజా నాయకులు కాలేరు. ప్రజా నాయకులు కావాలంటే ప్రజలతో నిత్యం సంబంధాలతో పాటు రాష్ట్ర సమస్యలపై గళం విప్పాలని, వాటిని పరిష్కరించడంలో తన మార్కు సాధించాలని, అప్పుడే వారు రాజకీయ నాయకులుగా ఎదుగుతారన్నారు.
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విషయం మాట్లాడుతూ ఆవేశంలో తాను పార్టీ పెడతానని ప్రకటించారు. ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలోకి రాకుండా చేస్తానని ఆయన అనటంలో తప్పులేదు. ఎందుకంటే తనను ఐదేళ్లపాటు రెండు సార్లు సస్పెన్షన్ కు గురిచేశారు. అందువల్ల ఆయనలో కోపం ఉండి ఉండవచ్చన్నారు. కూటమి ప్రభుత్వంలో తనకు మంచి పదవి వస్తుందని ఏబీ వెంకటేశ్వరావు ఆశించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏబీవీ కంటే కింది స్థాయి వారికి పెద్ద పదవులు ఇచ్చారు. కానీ ఆయనకు మాత్రం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టారన్నారు. దీని వల్ల ఏబీవీలో కొంత అసంతృప్తి ఈ ప్రభుత్వంపై ఉందని అందుకే ప్రజా ఉద్యమాలు నిర్వహించే వారితో కలిసి పనిచేస్తున్నారన్నారు. ప్రజా ఉద్యమాలు అంటే ఆషామాషీ కాదనే విషయం త్వరలోనే ఆయనకు బోధపడుతుందని పేర్కొన్నారు.