డాక్టర్‌ సుధాకర్‌ను ఎందుకు పరామర్శించలేదు
x

డాక్టర్‌ సుధాకర్‌ను ఎందుకు పరామర్శించలేదు

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు మాజీ సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


నాడు సీఎంగా ఉండగా డాక్టర్‌ సుధాకర్‌ను ఎందుకు పరామర్శించలేదని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిమీద ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు ధ్వజమెత్తారు. అలాంటి జగన్‌మోహన్‌రెడ్డి నేడు తెనాలికి వెళ్లి నేరస్తులను పరామర్శించడం దారుణమని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమకు ఓటేయని ప్రజలపై వెన్నుపోటు దినంగా నిర్వహించేందుకు వైసీపీ ప్లాను చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మంగళవారం ఆయన అమరావతిలో మాట్లాడుతూ జూన్‌ 4న వైసీపీ చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయనే సామెత వైఎస్‌ జగన్‌ వంటి నాయకులను చూసే వ్యాప్తిలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. తెనాలి ఘటన బాధితులను జగన్‌ పరామర్శించడంపై రఘురామకృష్ణరాజు సెటైర్లు పేల్చారు. తెనాలి గంజాయి బ్యాచ్‌ను తెనాలికి వెళ్లి పరామర్శించి రాజకీయంగా జగన్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఎద్దేవా చేశారు.

సాక్షాత్తు పోలీసులపై దాడులు, హత్యాయత్నం చేసిన నిందితులకు జగన్‌ పరామర్శలా, ఆ నిందితులకు జగన్‌ అండదండలా అంటూ నిలదీశారు. జగన్‌ దిగజారుడు రాజకీయాలు చేస్తారనడానికి తెనాలి టూరే నిదర్శనమని విమర్శించారు. కేవలం ఓట్ల కోసం జగన్‌ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరగాళ్లను వెనుకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైసీపీ శ్రేణుల అదృష్టమని అన్నారు.

నాడు తాను ఎంపీగా ఉన్నప్పుడు పోలీసుల చేత తనను దారుణ హింసలకు గురి చేయించారని, అప్పటి పోలీసు అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ చేత తననకు పోలీసు స్టేషన్‌లోనే కొట్టించింది జగన్‌మోహన్‌రెడ్డే అని సంచలన ఆరోపణలు గుప్పించారు. అలాంటి జగన్‌మోహన్‌రెడ్డిని చూసి జాలి పడటం తప్ప ఏమీ చేయలేమని ఎద్దేవా చేశారు. అయితే నేర ప్రవృత్తి కలిగిన జగన్‌మోహన్‌రెడ్డి వంటి నాయకుల పట్ల జాగ్రత్త ఉండాలని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు, ప్రజాస్వామానికి జగన్‌ చర్యలు మంచివి కాదని విమర్శలు గుప్పించారు.
Read More
Next Story