
ఫామ్ హౌస్ కు కవిత ఎందుకు వెళ్ళారు ?
లేఖ బయటకు వచ్చిన తర్వాత అన్న పేరు చెప్పకుండా కేటీఆర్(KTR) పై కవిత చాలా ఆరోపణలు, విమర్శలు చేసింది
తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు సరెండర్ అయ్యేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. 15 రోజులుగా కవితకు ఫామ్ హౌస్ లోకి ఎంట్రీకి అనుమతించలేదు కేసీఆర్. పార్టీలో లోపాలపై కేసీఆర్ కు కవిత(Kavitha) రాసిన లేఖ లీక్ అవటంతో బీఆర్ఎస్ లో సంచలనాలు మొదలైతే, తెలంగాణ రాజకీయాలు హాటు హాటుగా తయారయ్యాయి. కవిత లేఖ లీక్ అవటం వల్ల తేలింది ఏమిటంటే కల్వకుంట్ల ఫ్యామిలీలో అన్నా, చెల్లెళ్ళ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని. తండ్రికి లేఖ రాయటం వల్ల అన్నను ఏదో సాదిద్దామని కవిత అనుకుంటే అది రివర్సయి చివరకు తానే దెబ్బతినేసింది. లేఖ బయటకు వచ్చిన తర్వాత అన్న పేరు చెప్పకుండా కేటీఆర్(KTR) పై కవిత చాలా ఆరోపణలు, విమర్శలు చేసింది. అన్నను లేదా తండ్రిని బెదిరించే ధోరణిలో కవిత చేసిన ఆరోపణలు, విమర్శలను కేసీఆర్ పట్టించుకున్నట్లు లేదు. అందుకనే కవితను పిలిపించి కేసీఆర్ మాట్లాడలేదు.
జాగృతి సంస్ధ పేరుతో సొంత పార్టీ పెట్టుకోవాలని కవిత చేసిన ప్రయత్నాలు కూడా అంత సక్సెస్ అయినట్లు లేదు. అందుకనే తండ్రితో సయోధ్యకు ప్రయత్నాలు చేసింది. అయితే కేసీఆర్(KCR) అందుకు అవకాశం ఇవ్వకుండా పూర్తిగా దూరం పెట్టేశారు. దాంతో లాభంలేదని అర్ధమైపోయిన కవిత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని ఫామ్ హౌస్ లోకి వెళ్ళారు. నేరుగా మేడమీదకు వెళ్ళి తండ్రిని పలకరించినా కేసీఆర్ పట్టించుకోలేదు. దాంతో తండ్రికి కవిత సరెండర్ అయ్యేందుకు రెడీ అయినట్లు అర్ధమవుతోంది. భర్త అనీల్ తో కలిసి ఫామ్ హౌస్ కు వచ్చిన విషయం తెలిసి కూడా కవితను అధినేత దూరంగా ఉంచేశారు. తనను ధిక్కరించిన వారు బయటవారైనా, సొంతబిడ్డయినా ఒకటే ట్రీట్మెంట్ అన్నట్లుగా ఉంది కేసీఆర్ వైఖరి.
బీఆర్ఎస్ కు సమాంతరంగా జాగృతి(Jagruthi) సంస్ధను బలోపేతం చేసేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు పెద్దగా ఫలిస్తున్నట్లు కనబడలేదు. ఎందుకంటే కవిత అస్తిత్వమే కేసీఆర్ మీద ఆధారపడుంది. మైనస్ కేసీఆర్ కూతురు కవిత జీరో. కేసీఆర్ మద్దతులేకపోతే కేటీఆర్ ఎదుగుదల కూడా కష్టమే. ఎందుకంటే వీళ్ళిద్దరు కేసీఆర్ పేరుచెప్పుకుని పార్టీలో, రాజకీయాల్లో చెలామణి అవుతున్నారే కాని సొంతంగా ఎలాంటి కెపాసిటి లేదు. ఈ విషయం కవిత మరచిపోయినట్లున్నారు. అందుకనే బీఆర్ఎస్(BRS) కు సమాంతరంగా జాగృతి ద్వారా కార్యక్రమాలు చేయాలని, జనాల్లోకి వెళ్ళాలని చాలా ప్లాన్ వేశారు. అయితే అవేవీ పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు లేదు. ఎందుకంటే జాగృతి కార్యకర్తలు, లేదా కవిత మద్దతుదారులంటు ప్రత్యేకంగా పుట్టుకురాలేదు. ఇపుడు కవిత వెంట ఉన్నవారిలో అత్యధికులు బీఆర్ఎస్ లోని వాళ్ళే. పార్టీలో కవిత మద్దతుదారులుగా ఉన్నవారే ఇపుడు జాగృతి మద్దతుదారులుగా హడావుడి చేస్తున్నారు.
అధినేత కేసీఆర్ కు కూతురు ఎప్పుడైతే దూరమయ్యారో వెంటనే బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ కూడా కవితను దూరంపెట్టేశారు. కవిత పాల్గొంటున్న ఏకార్యక్రమంలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనటంలేదు. బీఆర్ఎస్ మద్దతులేకుండా కవిత నిర్వహించే ఏ కార్యక్రమమూ సక్సెస్ కాదు. కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కవిత రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపిచ్చారు. హైదరాబాదులో ఇందిరాపార్క్ దగ్గర దీక్ష జరగటం తప్ప రాష్ట్రంలో ఎవరూ కవిత పిలుపును పట్టించుకోలేదు. హైదరాబాద్ లో కూడా దీక్ష ఎందుకు జరిగిందంటే స్వయంగా కవిత పాల్గొన్నారు కాబట్టే. ఇంకా విచిత్రం ఏమిటంటే కవిత దీక్ష అబాసుపాలైంది. ఎందుకు అబాసుపాలైందంటే కమిషన్ విచారణకు హజరవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయిన తర్వాత నిరసన పేరుతో కవిత ఓవర్ యాక్షన్ చేస్తోందన్న విషయం జనాల్లోకి వెళ్ళిపోయింది. అందుకనే ఆమె కార్యక్రమం అబాసుపాలైంది.
కవిత మార్గాలు మూసుకుపోయాయా ?
జాగృతి సంస్ధ కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో చేరటమో లేకపోతే మద్దతు తీసుకోవటం మాత్రమే కవితకు మిగిలిన ఛాన్సు. అయితే ఏ పద్దతిలో కూడా రెండు జాతీయపార్టీల నుండి మద్దతు లభించలేదు. మద్దతును పక్కన పెట్టేస్తే కవితను తమపార్టీల్లోకి చేర్చుకునేది లేదని రేవంత్ రెడ్డి(Revanth), బండి సంజయ్(Bandi Sanjay), కిషన్ రెడ్డి(Kishan Reddy) బహిరంగంగా ప్రకటించారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని కవిత తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ప్రకటించారు. అయినా కేసీఆర్ పట్టించుకోలేదు, పిలుపురాలేదు. అందుకనే సమయంకోసం ఎదురుచూసిన కవిత పీసీ ఘోష్ కమిషన్ విచారణను అవకాశంగా తీసుకోవాలని అనుకున్నారు.
విచారణ జరిగిన 11వ తేదీన ఉదయం నుండే పార్టీ నేతల్లో కొందరు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్ళారు. సమయం దొరికిందని అనుకున్న కవిత భర్తతో కలిసి సందట్లో సడేమియా లాగ తాను కూడా ఫామ్ హౌస్ లోకి దూరేశారు. మిగిలిన నేతలతో పాటు ఇంట్లోకి వెళ్ళిని కేసీఆర్ మాత్రం కవితను పలకరించలేదని సమాచారం. తానే చొరవతీసుకుని ‘గుడ్ మార్నింగ్ డాడీ’ అని పలకరించినా కేసీఆర్ మాత్రం ఆమె వైపు కూడా చూడలేదని పార్టీలో టాక్. కేసీఆర్ ను కాదంటే తనకు భవిష్యత్తులేదన్న విషయం కవితకు బాగా అర్ధమైనట్లుంది. అందుకనే ఏదో పద్దతిలో కేసీఆర్ ను ప్రసన్నంచేసుకుని మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు.
కేటీఆర్ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనా ?
ఇపుడు కవిత ముందున్నవి రెండే మార్గాలు. అవేమిటంటే మొదటిది ఎదురుతిరిగి తానేమిటో నిరూపించుకోవటం. రెండోది పూర్తిగా సరెండర్ అయిపోవటం. మొదటి పద్దతి లాభంలేదని ఇప్పటికే తేలిపోయింది. అందుకనే రెండోపద్దతయిన సరెండర్ నే కవిత ఎంచుకున్నట్లు కనబడుతోంది. రెండో పద్దతిని ఎంచుకోవటం అంటే సోదరుడు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించటమే. ఎందుకంటే పార్టీకి అధినేత కేసీఆరే అయినా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీవ్యవహారాలన్నీ కేటీఆరే చూసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. కేటీఆర్ నాయకత్వాన్ని ఎట్టిపరిస్ధితిలోను అంగీకరించేదిలేదని కవిత ఆమధ్య భీకరమైన ప్రకటనచేశారు. మరిపుడు తండ్రికి సరెండర్ అవటం అంటే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయటానికి సిద్ధపడినట్లే అనుకోవాలి. మరీమాత్రం దానికి కేటీఆర్ నాయకత్వాన్ని ఎట్టి పరిస్ధితుల్లోను అంగీకరించననే ప్రతిజ్ఞ ఎందుకు చేసినట్లు ?
కేసీఆర్ కు సరెండర్ అవటం అంటే కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తు బహుశా మరో ప్రకటన చేయాలేమో. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్లు కవిత ప్రకటించకపోతే కవితను కేసీఆర్ దగ్గరకు కూడా రానీయరు. కేసీఆర్ కు సరెండర్ అవటం అంటే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయటానికి కవిత సిద్ధపడటం ఒకటే మార్గం. మరి కవిత ఎప్పుడు ప్రకటిస్తారు ? కేసీఆర్ ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.