
రేషన్ సరుకుల పంపిణీపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే
దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
ఆంధ్రప్రదేశ్లో జూన్ 1 నుంచి రేషన్ డిపోల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. రేషన్ సరుకుల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే..
ఇకపై నెలలో 15 రోజులపాటు... రోజు రెండు పూటల... చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ చేయడం జరుగుతుంది. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసేసింది. ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసి, ఇంటింటికి ఇవ్వడం మానేసింది. నెలలో 1–2 రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇచ్చేవారు. దీని వల్ల ఎంతో మంది పేదలకు ఆ సరుకులు అందక ఇబ్బందులుపడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకి సెలవు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది.
వీటిని అరికట్టేందుకు, ప్రతీ పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందించేందుకు ఇకపై ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు.. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 8గంటల వరకు రేషన్ డీలర్ల దుకాణాల వద్ద అందిస్తాం. దీని ద్వారా రద్దీని తగ్గించడమే కాకుండా, ప్రతీ ఒక్క కుటుంబానికి సరుకులు అందుతాయి. అంతేకాకుండా దివ్యాంగులకు, 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Next Story