ఒక్కో ఇటుకా పేరుస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం
గత ఐదేళ్లలో అసమర్థ పాలన వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. నేను ఎంత లోతుకు పోతే అన్ని ఎక్కువ సమస్యలు కనపడుతున్నాయి. ఇలాంటి విధ్వంసం నా జీవితంలో చూడలేదు. మనో సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తున్నాము. 18 నెలల్లో రాష్ట్రం నిలదొక్కుకునే పరిస్థితికి తీసుకొచ్చాము. ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ విజయవంతంగా అమలు చేశాం. క్రైస్తవుల్లో పేద కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ ఆర్థిక భరోసా కల్పించాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు పథకం, పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం,పాస్టర్లకు గౌరవ వేతనాలు ఇలా అన్ని విధాలా క్రిస్టియన్ మైనారిటీలను ఆదుకుంటున్నాం. ప్రత్యేకంగా క్రైస్తవ సమాజం కోసం రూ. 22 కోట్లు ఖర్చు చేసి,44,812 మంది క్రైస్తవ సోదర సోదరీమణులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాం. రాష్ట్రంలోని 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నాం. మే 2024 నుంచి నవంబర్ 2024 వరకు...మొత్తం రూ.30 కోట్లు విడుదల చేశాం. డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్ల సాయాన్ని ఈ నెల 24వ తేదీ లోగా వారి ఖాతాల్లో వేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
క్రైస్తవులకు ఆర్థిక చేయూత
క్రైస్తవుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉపాధి, ఆర్థిక సాధికారత విషయంలో అండగా ఉంటాం. భద్రతకు, గౌరవానికి భంగం కలగనివ్వం . వారి కోసం ఉపాధి పథకాలను పునః ప్రారంభించాం. 2025–26లో రూ.20 కోట్లు కేటాయించి,2,000 మంది లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. సీఈడీఎం ఆధునీకరణకు రూ.5 కోట్లు కేటాయించాం, రూ.6 కోట్ల పెండింగ్ బకాయిలను కూడా క్లియర్ చేస్తున్నాం. గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, టెట్, నీట్, యూపీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం. మెగా డీఎస్సీ నిర్వహించాం. కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీ లో 26 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మందికి శిక్షణ ఇస్తే 500 మందికి పైగా ఎంపికయ్యారు. భవిష్యత్ లో మరింత మంది శిక్షణ అందిస్తాం. అలాగే 2014 నుంచి 2018 మధ్య 977 చర్చిలకు రూ.70 కోట్లు మంజూరు చేశాం. వీటిలో 377 చర్చ్ ల నిర్మాణం పనులు పూర్తయ్యాయి. మన హయాంలో గుంటూరులో క్రిస్టియన్ భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు ఖర్చు చేశాం. మరిన్ని నిధులు విడుదల చేసి ఈ ఏడాది క్రిస్టియన్ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవ సోదర సోదరీమణులకు కూడా ఆర్థిక సాయం చేస్తున్నాం. వార్షిక ఆదాయంరూ. 3 లక్షల లోపు ఉన్న వారికి రూ. 60,000,రూ. 3 లక్షలకు పైగా ఉన్న వారికి రూ. 30,000 ఇస్తున్నాం. దీని కోసం ఈ ఏడాది రూ.1.50 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి తెలిపారు.
సేవా కార్యక్రమాలకు స్పూర్తి క్రైస్తవ మిషనరీలు
సమాజ సేవలో క్రైస్తవ సంస్థలు ముందున్నాయి. క్రిస్టియన్ పాఠశాలలు, కాలేజ్ లు, ఆసుపత్రులు దశాబ్దాలుగా చేస్తున్న సేవలు వెలకట్ట లేనివి. లక్షల మంది జీవితాల్లో మార్పు తెస్తున్నాయి. మిషనరీ పాఠశాలల్లో చదివి ఎంతోమంది ఎంతో ఉన్నత స్థానాలకు వెళ్లారు. క్రమశిక్షణ, సేవ, నాలెడ్జ్ కు మిషనరీ విద్యా సంస్థలు కేంద్రంగా ఉన్నాయి. గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీ, ఆంధ్ర లయోలా కాలేజీ వంటి క్రిస్టియన్ విద్యా సంస్థలు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నతికి సేవ చేశాయి. ఎన్టీఆర్ కూడా మిషనరీ కాలేజ్ లోనే చదువుకున్నారు. పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం నిర్ధుష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.