
వార్ ఎఫెక్ట్–హాస్టళ్ల మూసివేతకు ఆంధ్ర యూనివర్శిటీ నిర్ణయం
పరీక్షలు పూర్తి అయిన విద్యార్థులను హాస్టళ్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇండియా–పాకిస్తాన్ యుద్ధ ప్రభావం తాజాగా యూనివర్శిటీలకు పాకింది. ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర యూనివర్శిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. మందస్తు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించారు. తీర ప్రాంతంలోని విశాఖపట్నం ఆంధ్ర యూనివర్శిటీ వసతి గృహాలను తాత్కాలికంగా మూసివేయాలని యూనివర్శిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఇండియా–పాకిస్తాన్ యుద్ధం నెలకొన్న నేపథ్యంలో తీర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం శుత్రు దేశానికి టార్గెట్గా ఉంది. విశాఖలో భద్రతా దళాలకు సంబంధించిన ప్రధాన కేంద్రం ఉండటంతో దీనిపైన శుత్రు దేశం గురిపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు భద్రతా దళాలు ఇప్పటికే మాక్ డ్రిల్ను కూడా నిర్వహించాయి. నగర ప్రజలను అప్రమత్తం కూడా చేసింది.
ఇండియా–పాక్ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖ నగరంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు స్పందించారు. హాస్టళ్లలోని విద్యార్థులను వారి ఇళ్లకు పంపడం సురక్షితంగా ఉంటుందని భావించారు. ఈ నేపథ్యంలో వసతి హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు యూనివర్శిటీ అధికారులు ఆదేశాలు కూడా జారీ చేశారు. యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, భద్రత తమ ప్రథమ కర్తవ్యమని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికే పరీక్షలు పూర్తి అయిన విద్యార్థులు తక్షణమే తమ హాస్టళ్లను ఖాళీ చేసి, వారి స్వస్థలాలకు సురక్షితంగా వెళ్లాలని విద్యార్థులకు యూనివర్శిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత హాస్టళ్లను ఎప్పుడు పునఃప్రారంభిస్తారనేదానిపై తర్వాత ప్రకటిస్తామని యూనివర్శిటీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో హాస్టళ్లను ఖాళీ చేసే పనిలో విద్యార్థులు ఉన్నారు.
Next Story