
హెలికాఫ్టర్ లో నుంచి చూస్తే విజయవాడ ఎట్టుంటదంటే...
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ నగర వాసులకూ, పర్యాటకులకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఓపక్క కనకదుర్గమ్మ నవరాత్రులు.. మరోపక్క విజయవాడ ఉత్సవాలు.. బెజవాడకు కొత్త కళొచ్చింది. ఇందులో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ నగర వాసులకూ, పర్యాటకులకూ ప్రత్యేక ఆకర్షణగా మారింది.
అమ్మవారి దసరా ఉత్సవాలకు మరింత శోభ తీసుకొచ్చేలా విజయవాడ ఉత్సవంతో కళకళలాడుతోంది. కళా, సాంస్కృతిక వైభవంతో సందడిగా మారిన ఈ వేళ, పండుగ సంబరాలను గగనతలంలోంచి చూడటం పర్యాటకులకు కొత్త అనుభూతినిచ్చింది.
హెలికాప్టర్లో ఎక్కి పై నుంచి దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ ఆలయం, ప్రకాశవంతమైన సిటీ లైట్స్, కృష్ణానది ఒడ్డున మెరుస్తున్న దృశ్యాలు, గుణదల కొండ, ముస్తాబైన నగరాన్ని చూసి నగరవాసులు మంత్ర ముగ్ధులవుతున్నారు.
“పండుగ వాతావరణంలో ఇలా నగరాన్ని పై నుంచి చూడటం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం” అని పలువురు ప్రయాణికులు సంబరపడుతున్నారు.
టికెట్ ధర రూ. 5 వేలైనా లెక్కచేయకుడా ఒక్కసారైనా నగరాన్ని గగనతలం నుంచి చూసి మురిసిపోదామని స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులూ ఆసక్తి చూపుతున్నారు.
ఒక్కో ట్రిప్పులో ఐదుగురు ప్రయాణీకుల్ని ఎక్కించుకుని నగరాన్ని చుట్టి వస్తున్నారు పైలెట్.
(ఫోటోలు- రవి పెదపోలు (ది ఫెడరల్, ఆంధ్రప్రదేశ్)
Next Story