విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పలుమార్లు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించినా ఫలితం లేక పోవడంతో సోమవారం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిమాండ్ ఖైదీగా వల్లభనేని వంశీ విజయవాడ జైల్లో ఉన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసుతో పాటు అదే కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్థన్ కిడ్నాప్ కేసు, భూ ఆక్రమణల కేసు, అక్రమ మైనింగ్ కేసు, నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుల్లో ఆయనను నిందితుడిగా చేర్చారు. తొలుత నమోదు చేసిన టీడీపీ కార్యాలయం దాడి, సత్యవర్థన్ కేసు, భూ ఆక్రమణ కేసు, అక్రమ మైనింగ్ కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు చేశారు. ఈ లోగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసును నమోదు చేశారు. వరుస కేసులు నమోదు కావడంతో 100 రోజులకుపైగా వంశీ రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉన్నారు.
విజయవాడ జైలుకు తరలించిన నాటి నుంచి శ్వాస సంబంధ వ్యాధులతో వంశీ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రెండు మూడు సార్లు విజయవాడ జీజీహెచ్కు తరలించి వైద్య చికిత్సలు చేశారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు విచారణకు కంకిపాడు పోలీసు స్టేషన్కు తీసుకెళ్లినప్పుడు వంశీకి అనారోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. స్టేషన్లోనే వంశీ వాంతులు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో వంశీకి మంచి వైద్యం చేయించాలని, దీని కోసం మంగళగిరి ఎయిమ్స్కు పంపాలని వంశీ భార్య పంకజశ్రీ కోరారు. అయితే మంగళగిరి ఎయిమ్స్ కాకుండా గుంటూరు జీజీహెచ్కు వంశీని తరలించారు.
అయితే వంశీ భార్య పంకజశ్రీని గుంటూరు జీజీహెచ్ వద్ద పోలీసులు అడ్గుకున్నారు. ఆసుపత్రిలోనికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో పంకజశ్రీకి, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకు అనుమతించరని పోలీసులను వంశీ భార్య నిలదీసింది. వంశీక ఏ పరీక్షలు చేస్తున్నారో, ఎలాంటి వైద్యం చేస్తున్నారో తనకు ఎలా తెలుస్తుందని, లోపలికి అనుమతిస్తే వైద్యులను అడిగి తెలుసుకుంటానని పోలీసులను ఆమె వేడుకున్నా పోలీసులు ఆమెను అనుమతించేందుకు ససేమిరా అన్నారు. ఆమెను లోపలికి రానీకుండా గేట్లను క్లోజ్ చేశారు. ఎలాంటి వైద్యం చేస్తున్నారు, ఏం పరీక్షలు చేస్తున్నారనే దానిపై ఆమె ఆందోళన చెందుతున్నారు.