
వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత
శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వల్లభనేని వంశీ.
విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా శ్వాసకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఇది వరకు ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు, చికిత్సలు కూడా చేశారు. అయితే తాజాగా శనివారం కూడా ఆయన మరో సారి తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. దీంతో ఆయనను మళ్లీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ మీద మరో రెండు కేసులు నమోదు చేశారు. గన్నవరంలో భారీగా అక్రమ మైనింగ్ కేసుకు పాల్పడ్డారని ఆరోపణల మీద ఒక కేసు, నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో మరో కేసును నమోదు చేశారు. అయితే నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని నూజివీడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వంశీ పిటీషన్ను స్వీకరించిన నూజివీడు కోర్టు సోమవారం దీనిపైన విచారణ జరపనుంది.
2019 ఎన్నికల్లో తన గెలుపు కోసం పని చేసిన బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాలకు చెందిన కొంత మందికి నకిలీ ఇళ్ల స్థలాల పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ అక్టోబరులో హనుమాన్ జంక్షన్ పీఎస్లో 9 మందిపై కేసు నమోదు చేశారు. అయితే నాడు కేసు నమోదు చేసిన వారి జాబితాలో వంశీ పేరు లేదు. అయితే 2024లో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇదే కేసుకు సంబంధించి ఇచ్చిని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. వంశీ హయాంలో ఈ నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, వీటిపైన అధికార ముద్రలు నకిలీవని రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదకలో తేలిందని, దీంతో వంశీని కూడా పదో నిందితుడుగా చేర్చుతూ వంశీపై కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం జైల్లో ఉన్న వంశీని శుక్రవారం నూజివీడు 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రావణి ముందు పోలీసులు హాజరు పరిచారు. మరో వైపు సత్యవర్థన్ కేసులో వంశీకి ఇది వరకే బెయిల్ మంజూరు చేసింది.
Next Story