
కృష్ణంరాజును కస్టడీలోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు
అమరావతి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోణలపై కృష్ణంరాజుపై కేసు నమోదు చేశారు.
సీనియర్ జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు కృష్ణంరాజును విచారించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు ఆయనను శుక్రవారం కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణంరాజును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి ఆయనను తుళ్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు.
ఇటీవల సాక్షి టీవీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు వివిఆర్ కృష్ణంరాజు అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల మీద ఆయనపై అమరావతి మహిళలు ఫిర్యాదులు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేసి గుంటూరు జైలుకు తరలించారు. కృష్ణంరాజును విచారించేందుకు అనుమతులు మంజూరు చేయాలని తుళ్లూరు కోర్టును పోలీసులు కోరారు. దీనిపై విచారణ చేపట్టిన మంగళగిరి న్యాయస్థానం పోలీసుల అభ్యర్థన మేరకు మూడు రోజుల పాటు విచారణకు అనుమతులు మంజూరు చేస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును విచారించనున్నారు. ఎవరి ప్రోద్బలంతో అమరావతి మహిళలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు వంటి పలు అంశాలపై పోలీసులు కృష్ణంరాజును ప్రశ్నించనున్నారు.
Next Story