
సీనియారిటీతో సంబంధం లేకుండా నాలుగేళ్లుగా ఆ శాఖలో బదిలీలు
ఈ ఏడాది బదిలీ అయిన వారు మరుసటి ఏడాదిలో బదిలీ అవుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? కారకులు ఎవరు?
ఏ శాఖలోనైనా ఒక ఉద్యోగి, లేదా అధికారిని బదిలీ చేయాలంటే కనీసం మూడు సంవత్సరాలు సీనియారిటీ ఉండాలి. లేదా ఐదేళ్లు పూర్తిగా అక్కడే పనిచేసి ఉండాలి. అయితే అవేమీ లేకుండా ఏపీలోని జీఎస్టీ శాఖలో నాలుగేళ్లుగా వరుస బదిలీలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి?
జీఎస్టీ అధికారులు, ఉద్యోగుల బదిలీల వ్యవహారం 2025లో ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ సీనియారిటీ ఆధారంగా జరుగుతున్న వరుస బదిలీల వల్ల అధికారులు, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ అధికారులు, ఉద్యోగుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ శాఖ విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, గుంటూరు జోన్లలో, అలాగే విజయనగరం, కర్నూలు, నెల్లూరు సహా 16 డివిజన్లలో పనిచేస్తోంది. ఈ జోన్లు, డివిజన్లలో జీఎస్టీ శాఖ అధికారులు, సిబ్బంది వస్తు, సేవా పన్ను (GST) విధానాల అమలు, పన్ను సేకరణ, వ్యాపారులతో సంబంధాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారు. 2025లో జరుగుతున్న బదిలీలు, ముఖ్యంగా స్టేషన్ సీనియారిటీ ఆధారంగా జరిగిన బదిలీలు, అధికారులు, సిబ్బంది మధ్య ఆందోళనకు కారణమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ అధికారులు, ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు ఈ బదిలీల వల్ల కలిగే ఇబ్బందులను బహిరంగానే విమర్శించారు.
2024లో బదిలీ అయిన అధికారులు 2025లో మళ్లీ బదిలీ జాబితాలోకి రావడం, ఆంధ్రప్రదేశ్ జనరల్ ట్రాన్స్ఫర్-2025 మార్గదర్శకాల ప్రకారం స్టేషన్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోక పోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. ఈ విధానం అధికారులు, సిబ్బంది జీవనంలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తోందని, వారి వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సంఘం ఆరోపించింది.
వరుస బదిలీలు ఎందుకు జరుగుతున్నాయి?
2022 నుంచి జీఎస్టీ శాఖలో సీనియారిటీలతో సంబంధం లేకుండా బదిలీలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది పరిశీలిస్తే అధికారులు చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. 2022లో ఏపీలోని అద్దంకి, వినుకొండ, మాచర్ల, తెనాలిలో ఒక కార్యాలయం, చిలకలూరిపేట, గుంటూరులో ఒక కార్యాలయాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఇందకు కారణం ఆహార పంటలపై జీఎస్టీ వసూలే లేకపోవడం. కమర్శియల్ క్రాప్స్ అయిన పత్తి, మిర్చి పై మాత్రమే జీఎస్టీ వసూలు ఈ ప్రాంతాల్లో ఉంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు కావడం వల్ల ఇక్కడ జీఎస్టీ కార్యాలయాలు అవసరం లేదని ప్రభుత్వం భావించి రద్దు చేసింది.
అక్కడ పనిచేసే 150 మంది ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏమిటి?
ఆరు కార్యాలయాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అక్కడి కార్యాలయాల్లో పనిచేస్తున్న గజిటెడ్, నాన్ గజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగులు సుమారు 150 మందిని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల్లో ఖాలీగా ఉన్న పోస్టుల్లో నియమించారు. వారి సమీప ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఖాళీలు ఏర్పడినప్పుడు తిరిగి వారిని ఆ కార్యాలయాల్లో నియమించే ఒప్పందంపై వేరే కార్యాలయాలకు పంపించారు. నాలుగేళ్లు గడిచినా అది సక్రమంగా అమలు కాలేదు. ఎక్కువ మందిని విజయవాడలోని రీజినల్ ఆఫీస్ కు, కొందరిని కమిషనరేట్ కు, మరికొందరిని తిరుపతి, విశాఖపట్నంలలోని జోనల్ కార్యాలయాలకు బదిలీ చేశారు.
2023లో రేషనలైజేషన్ లో తప్పులు
2023వ సంవత్సరంలో జరిపిన రేషనలైజేషన్ లో రద్దయిన కార్యాలయాల నుంచి వచ్చిన వారికి ముందుగా ప్రాధాన్యత ఇచ్చి బదిలీలు చేసినట్లైతే ఒకే సంవత్సరంలో సమస్య పరిష్కారం అయ్యేది. అలా కాకుండా అక్కడ గతంలో పనిచేస్తున్న వారితో పాటు కొత్తగా వేసిన వారిని కలిపి రేషనలైజేషన్ (సమర్థవంతంగా, సమానంగా, అవసరాలకు తగినట్లు పునర్వ్యవస్థీకరించడం) చేయడం వల్ల సమస్యలు తలెత్తాయి.
ఫోకల్ పోస్టులకు పెరిగిన పోటీ
జీఎస్టీలో అధికంగా పన్నులు వసూలు చేసే సీట్లు, తక్కువ పన్నులు వసూలు చేసే సీట్లు ఉంటాయి. వీటిని ఫోకల్, నాన్ ఫోకల్ పోస్టులుగా ఉద్యోగులు పిలుస్తుంటారు. ఫోకల్ అంటే ఆదాయం వచ్చేవి, నాన్ ఫోకల్ అంటే సరిగా ఆదాయం రానివని అర్థం. ఈ పోస్టుల్లో చేరేందుకు ఉద్యోగులు పోటీపడి పలువురి నుంచి రెకమెండేషన్ లు చేయించుకోవడం పరిపాటిగా మారింది. ఫోకల్ పోస్టులకు పోటీ పెరగటంతో పలుకుబడి ఉన్న వారు ఆ పోస్టుల్లోకి వెళ్లి పోతున్నారు. మిగిలిన వారు అలాగే ఉంటున్నారు. ఇలా పెరిటిన పోటీ అధికారులకు తలనొప్పిగా మారింది.
ఈనెల 20 వరకు బదిలీలు
జీఎస్టీ శాఖలో ఈనెల 20 వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. దీంతో తమకు కావాల్సిన ప్రాంతాలకు కావాల్సిన సీట్లలో వేయాలని పట్టుబడుతున్నారు. గతంలో వారికి ఇచ్చిన హామీ మేరకు బదిలీలు చేయాల్సిందేనని అధికారుల సంఘం పట్టుబడుతోంది. ఉన్నతాధికారులు సర్దుబాటు చర్యల్లో భాగంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఐదేళ్లు గడిచిన వారికి బదిలీలు జరుగుతున్నాయి. గతంలో రద్దయిన కార్యాలయాల నుంచి వచ్చిన వారిని కూడా బదిలీలు చేస్తున్నారు. అలాగే రిక్వెస్ట్ ట్రాన్సఫర్ లు కూడా అధికారులు చేస్తున్నారు. రిటైర్డ్ అయిన ఖాళీలు, పదోన్నతుల వల్ల వచ్చిన ఖాళీల్లో మాత్రమే ప్రస్తుతం బదిలీల భర్తీ జరుగుతోంది.
వరుస బదిలీల వల్ల అస్థిరత
స్టేషన్ సీనియారిటీ ఆధారంగా బదిలీలు జరపడం వల్ల 2024లో బదిలీ అయిన అధికారులు ఒక సంవత్సరం తిరగకముందే 2025లో మళ్లీ బదిలీ జాబితాలోకి వస్తున్నారు. ఈ వరుస బదిలీలు అధికారులు, సిబ్బంది జీవనంలో అస్థిరతను సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు విశాఖపట్నం, విజయవాడ వంటి జోన్లలో పనిచేసే అధికారులు తమ కుటుంబాలను ఒక నగరం నుంచి మరొక నగరానికి తరలించడం, పిల్లల విద్యను సర్దుబాటు చేయడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ అస్థిరత వారి మానసిక ఒత్తిడిని పెంచుతుంది. పనితీరును ప్రభావితం చేస్తుంది.
ఆరోగ్య సమస్యలు, రిటైర్మెంట్ సమీపంలో ఉన్నవారి సమస్యలు
జీఎస్టీ అధికారులు, ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు, ఆరోగ్య సమస్యలున్న అధికారులు, 2026లో రిటైర్మెంట్ సమీపంలో ఉన్న ఉద్యోగులను బదిలీల నుంచి మినహాయించాలని కోరారు. ఆరోగ్య సమస్యలున్న అధికారులకు బదిలీలు శారీరక, మానసిక ఒత్తిడిని పెంచుతాయి. రిటైర్మెంట్ సమీపంలో ఉన్నవారికి కొత్త స్టేషన్లో సర్దుబాటు చేసుకోవడం కష్టసాధ్యం. ఈ అంశం మానవీయ కోణంలో బదిలీ విధానంలో సమతుల్యత లోపించినట్లు సూచిస్తుంది.
బదిలీల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించడానికి, అధికారులు, సిబ్బంది నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకునేందుకు ఒక ఆన్లైన్ పోర్టల్ లేదా కమిటీని ఏర్పాటు చేయాలని, ఇది అధికారుల అసంతృప్తిని తగ్గించడంలో దోహద పడుతుందని యూనియన్ నాయకులు అంటున్నారు. జిఎస్టీ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తోట రాజశేఖర్ ఉద్యోగులు, అధికారులకు ఇబ్బందులు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తసుకుని బదిలీలు పూర్తి చేయాలని కోరారు.