
శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చిన వారిని ఆదుకోవాలి
రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో కొత్తపల్లి మండల తహశీల్దారు ఉమారాణికి వినతిపత్రం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్దిలో శ్రీశైలం ప్రాజెక్టు ఏంతో కీలకమైనదనీ...ఆ ప్రాజెక్టు కోసం వేలాది భూములను త్యాగం చేసిన ప్రజలు ఇప్పుడు చెట్టుకొకరు..పుట్టకొకరుగా చీలిపోయి సామాజికంగా, ఆర్థికంగా అత్యంత దయనీయస్థితిలో జీవిస్తున్నారనీ రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి అనుబంధ సంస్థ అయిన శ్రీశైలం ప్రాజెక్టు మునక ప్రాంతాల హక్కుల సాధన సమితి ఆద్వర్యంలో మునక ప్రాంతాల హక్కులను పరిరక్షించాలని కోరుతూ శనివారం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల తహశీల్దారు కార్యాలయం దగ్గర మునక ప్రాంత ప్రజలతో ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికై చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి నందికొట్కూరు ప్రాంతంలోని మండలాలలో కేసి కెనాల్ ఆయకట్టు క్రింద ఉన్న భూములతో సహా, యాబై వేల ఎకరాల పైగా అత్యంత సారవంతమైన భూమి, 66 గ్రామాలు మునకకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. ఈ గ్రామాల నుండి వేలాది మంది తమ చరిత్ర, స్మృతులు, సాంఘిక జీవనం, స్థిరాస్తులు వదులుకొని నిర్వాసితులైనారని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధికి వెలకట్టలేని త్యాగం చేసిన ఈ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి తాగు నీరు, సాగు నీరు అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత. అదేవిధంగా నిర్వాసితులకు శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం కూడా ప్రభుత్వ కనీస బాధ్యత. అయితే ఇక్కడ కొద్ది శాతం భూమికి నీరందేలాగా సంగమేశ్వరం, చెలిమెల్ల, లింగాల లాంటి ఎత్తిపోతల పథకాలు నిర్మాణం చేసినా, అవి ఆ కొద్ది ప్రాంతానికి కూడా ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులు ఉంచకపోవడం వల్ల ఈ ఎత్తిపోతల పథకాలకు నీళ్లు అందకపోవడం. వాటి నిర్వహణకు సంబంధించిన ఆర్థికపరమైన బరువును కూడా ఈ ప్రాంత రైతాంగంపై ఉంచడం. అదేవిధంగా నిర్వాసితులకు జీవో నెంబర్ 98 ద్వారా 1986 వ సంవత్సరంలో ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా, ఆ దిశగా అడుగులు వేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. 2014 తదనంతరం కొంతమంది నిర్వాసితులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చి పాలకులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసిన నందికొట్కూరు ప్రాంతానికి న్యాయం చేసే దిశగా పాలకులు తక్షణ కార్యాచరణ చేపట్టాలనీ అందులో ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టు మునక మండలాల్లోని ప్రతి గ్రామానికి త్రాగు నీటి వసతి కల్పించాలని, శ్రీశైలం ప్రాజెక్టు మునక మండలాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు పూర్తి ప్రభుత్వ నిర్వహణ భాద్యతతో అందించాలని, నీటి లభ్యతకు భరోసా కల్పిస్తూ అందించాలని డిమాండ్ ఆయన చేసారు.
కర్నూలు జిల్లాలోని ఉద్యోగాలలో కాకుండా, రాష్ట్రంలోని ఉద్యోగాలలో కొంత కోటాను శ్రీశైలం ప్రాజెక్టు మునక మండలాల నిర్వాసితులకు తక్షణమే కేటాయించాలనీ, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వడం ఆలస్యమైనందువల్ల వారి వయస్సు ఉద్యోగ అర్హతకు మీరిపోయిందని, దీంతో వారి వారసుల(కొడుకులు/ కూతుర్లు/ మనుమల్లు/మనుమరాల్లు)కు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, నిర్వాసితులందరికీ శాశ్వత ఉద్యోగాలను ఈ వార్షిక సంవత్సరంలోగా కల్పించాలని బొజ్జా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదే విధంగా శ్రీశైలం ప్రాజెక్టు పరిరక్షణకు, జీవిత కాలాన్ని పెంచడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితుల ప్రయోజనార్థం ఈ పై డిమాండ్లను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోవాల్సిందిగా కొత్తపల్లి మండల తహశీల్దారు ఉమారాణిని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు ఉమారాణి స్పందిస్తూ ఈ విషయాన్ని పై అధికారులకు తెలియచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైయన్ రెడ్డి, సామాజిక రాయలసీమ పార్టీ అధ్యక్షులు డాక్టర్ నాగన్న, కొక్కరంచ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, సాయిరాం, ఎదురుపాడు అయ్యపురెడ్డి, బిజెపి నందికొట్కూరు కోఆర్డినేటర్ ఎ శంకర్ గౌడ్, మార్తాపు మహేష్, ఎదురుపాడు సర్పంచ్ రహంతుల్ల, రాము, సమాచార హక్కు కార్యదర్శి సాయిదత్, మాజీ సర్పంచ్ పెద్దరాముడు, నందికుంట నారాయణరెడ్డి, వివిధ గ్రామాల రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story