తెనాలి ఘటనపై ఎస్పీ వాదన ఇదీ...
x
గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్

తెనాలి ఘటనపై ఎస్పీ వాదన ఇదీ...

‘వాళ్లు రౌడీషీటర్లు, కానిస్టేబుల్ ను చంపేందుకు చూశారు’


గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన చర్చ నియాంశమైంది. ఆ ప్రకటనలో ఏమన్నారంటే... తెనాలి పోలీస్ వారు ముగ్గురు యువకులను కొట్టే దృశ్యాలు ప్రసారం కావడం జరిగింది. సదరు దృశ్యాన్ని పరిశీలించగా గత నెలలో జరిగినట్లుగా మా దృష్టికి వచ్చినది. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ పై గంజాయి మత్తులో దాడికి పాల్పడినారని తెలిసింది. అది ఆమోదయోగ్యమైంది కాదు. ఖండించ దగినది.

జరిగిన సంఘటన గురించి ప్రాధమికంగా విచారించగా వేము నవీన్. చేబ్రోలు జాన్ విక్టర్, దోమ రాకేష్, షేక్ కరీముల్లా అను నలుగురు వ్యక్తులు తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐతా నగర్ నందు గంజాయి తాగుతూ దానికి బానిసలుగా మారి సామాన్య ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ తెనాలి 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కన్నా చిరంజీవి అనే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళే సమయంలో అతనిని అడ్డగించి.. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న నలుగురు యువకులు అతనిపై అకస్మాత్తుగా దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగినది.

వీరిపై అప్పటికే తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు రౌడీషీట్స్ కూడా నమోదై ఉన్నాయి. ఆ వ్యక్తులు గంజాయి, హత్యాయత్నం, దోపిడి, కొట్లాటలు, దొంగతనాలు, ఆడవారిపై దాడి చేయడం వంటి పలు కేసులలో నిందితులుగా ఉంటూ, జైలు కూడా వెళ్లి రావడం జరిగింది.


1) వేము నవీన్ @ కిల్లర్ పై 10 కేసులు.

2) చేబ్రోలు జాన్ విక్టర్ పై 10 కేసులు.

3) దోమ రాకేష్ పై 09 కేసులు.

వీరందరూ తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లుగా ఉన్నారు.

నేర చరిత్ర కలిగి రౌడీ షీటర్లుగా ఉంటూ విధుల్లో ఉన్న ఒక కానిస్టేబుల్ పై దాడిచేయడం ఎంతో అమానుషం.

శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసు శాఖలో పనిచేసే కానిస్టేబుల్ పై దాడి చేశారంటే సామాన్యులను పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేయడమే వారి ఉద్దేశంగా అనిపించింది...

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఆయనకు చట్టంపై ఎంత గౌరవ మర్యాదలు ఉన్నాయో అర్థం అవుతోంది. నిందితుల గురించి సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు. కానీ పోలీసులు రోడ్డుపై లాఠీలతో యువకులను కొట్టడం గురించి అసలు ప్రస్తావనే లేదు. ఐపీఎస్ అధికారిగా సతీష్ కుమార్ కు చట్టంపై ఎంతటి గౌరవం ఉందో దీనిని బట్టి అర్థం అవుతోందని హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఎస్పీ పోలీసుల చర్యలను పరోక్షంగా సమర్థిస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటోంది.

Read More
Next Story