పోలీసోళ్లు కొట్టి కొట్టి చంపేశారు
x

పోలీసోళ్లు కొట్టి కొట్టి చంపేశారు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగయ్య మృతి చెందారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మరో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రంగయ్య కడప రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. రంగన్న మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్‌గా ఉన్నారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఆ సమయంలో రంగన్నే వాచ్‌మెన్‌గా ఉన్నారు. దీంతో రంగన్న ఈ హత్య కేసులో సాక్షిగా ఉన్నారు. అయితే వాచ్‌మెన్‌ రంగయ్య మృతి మీద అతని భార్య తీవ్రంగా స్పందించారు. సంచలన ఆరోపణలు గుప్పించారు.రంగయ్య మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అతని భార్య సుశీలమ్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసుల వల్లే తన భర్త రంగయ్య ప్రాణాలు పోగొట్టుకున్నారని మండిపడ్డారు. రంగయ్య మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

తన భర్తను 2024 వరకు పోలీసులు చాలా బాగా చూసుకున్నారని, తర్వాత తన భర్తకు కష్టాలు వచ్చి పడ్డాయన్నారు. తన భర్తను హింసించి నరక యాతన పెట్టారని అన్నారు. చిత్ర హింసలకు గురి చేశారని అన్నారు. కీళ్లు విరగొట్టారని అన్నారు. పోలీసులే కొట్టి కొట్టి చనిపోయే విధంగా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త రంగయ్య పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరు వల్లే తన భర్త అనారోగ్యం పాలయ్యారని, బాగాలేక పోయినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. తన భర్త రంగయ్యను అరెస్టు చేసి ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారని, ఇప్పుడేమో మాకేం సంబంధం అంటున్నారని పోలీసుల మీద మండిపడ్డారు. తన భర్త రంగయ్య మరణానికి పోలీసులు, సీబీఐలే కారణమని ఆరోపించారు.
తప్పు ఒకళ్లు చేస్తే తన భర్తకు శిక్ష వేశారని కన్నీరుమున్నీరయ్యారు. గత ఆరేళ్లుగా పోలీసులు తమ ఇంటి ముందు కాపలా పెట్టి హింసించారని, పోలీసులు సరైన వైద్యం చేయించలేదన్నారు. మూడు నెలల నుంచి తన భర్త రంగయ్య మంచాన పడ్డారని ఆవేదన చెందారు. తప్పు చేసిన వాళ్లను పట్టించుకోకుండా తన భర్తను పట్టుకుని వేధించారని వాపోయింది.
Read More
Next Story