
కావాలనే కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తున్నారు
కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లే వచ్చే ప్రభుత్వం కూడా చేస్తే ఎవరు బాధ్యత వహించాలని వైసీపీ ప్రశ్నించింది.
లిక్కర్ స్వామ్, కాదంబరి జెత్వానీ కేసుల్లో కూటమి ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ నాయకుల మీద, పోలీసు అధికారుల మీద కౌంటర్ కేసులు పెట్టి వేధిస్తోందని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాల్లో మెజిస్ట్రేట్ ముందు ఏ నాడు పోలీసులకు ఫిర్యాదులు చేయని ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావాలనే ఆమెను పిలిపించి, వైసీపీ నాయకులు, పోలీసు అదికారుల మీద తప్పుడు ఫిర్యాదులు చేయించారని, ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేవని, దేశంలోనే మొదటి కౌంటర్ కేసని అన్నారు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే సాధారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు ఇరు వర్గాలు ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకుంటారని అన్నారు. కాదంబరి జెత్వానీ కేసు ఇంకా కోర్టులో ఉండగానే ఆ కేసును నీరు గ్రార్చి కేసును డైవర్ట్ చేసి, ఫిర్యాదు దారుడైన కుక్కల విద్యాసాగర్పై, ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులపైనా కూటమి ప్రభుత్వం కౌంటర్ కేసులు పెట్టిందని విమర్శలు గుప్పించారు.