కావాలనే కౌంటర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారు
x

కావాలనే కౌంటర్‌ కేసులు పెట్టి వేధిస్తున్నారు

కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లే వచ్చే ప్రభుత్వం కూడా చేస్తే ఎవరు బాధ్యత వహించాలని వైసీపీ ప్రశ్నించింది.


లిక్కర్‌ స్వామ్, కాదంబరి జెత్వానీ కేసుల్లో కూటమి ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తున్న నేపథ్యంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. కూటమి ప్రభుత్వం కావాలనే వైసీపీ నాయకుల మీద, పోలీసు అధికారుల మీద కౌంటర్‌ కేసులు పెట్టి వేధిస్తోందని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు ఎం మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. న్యాయస్థానాల్లో మెజిస్ట్రేట్‌ ముందు ఏ నాడు పోలీసులకు ఫిర్యాదులు చేయని ముంబాయి సినీ నటి కాదంబరి జెత్వానీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావాలనే ఆమెను పిలిపించి, వైసీపీ నాయకులు, పోలీసు అదికారుల మీద తప్పుడు ఫిర్యాదులు చేయించారని, ఇలాంటి కేసులు దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేవని, దేశంలోనే మొదటి కౌంటర్‌ కేసని అన్నారు. కేసు అండ్‌ కౌంటర్‌ కేసులంటే సాధారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగినప్పుడు ఇరు వర్గాలు ఒకరి మీద మరొకరు కేసులు పెట్టుకుంటారని అన్నారు. కాదంబరి జెత్వానీ కేసు ఇంకా కోర్టులో ఉండగానే ఆ కేసును నీరు గ్రార్చి కేసును డైవర్ట్‌ చేసి, ఫిర్యాదు దారుడైన కుక్కల విద్యాసాగర్‌పై, ఆ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులపైనా కూటమి ప్రభుత్వం కౌంటర్‌ కేసులు పెట్టిందని విమర్శలు గుప్పించారు.

నాడు చంద్రబాబు అరెస్టు అయిన సందర్భంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, అల్లర్లు జరక్కుండా బందోబస్త్‌ నిర్వంచారనే కారణంతోనే పోలీసు అధికారులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. నాడు సిట్‌కు అడ్డకేట్‌గా ఉన్న ఐ వెంకటేశ్వర్లుపైన కూడా కూటమి ప్రభుత్వం కేసు పెట్టిందని, ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పోలీసు అధికారుల సుదీర్ఘ కెరీర్‌లో చిన్న మచ్చ కూడా లేదన్నారు. నిజాయితీగా పని చేశారని, అనేక అవార్డులు, మెడల్స్‌ అందుకున్న వారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం కూడా వ్యవహరిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. గూగూల్‌ టేక్‌ అవుట్స్, ఫోన్‌ రోమింగ్‌ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని వచ్చే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లు చేస్తే దానికి ఎవరు బాధ్యత వహించాలని ఆయన నిలదీశారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను, కూటమి పెద్దలను సంతృప్తి పరిచామని చేతులు దులుపుకుంటే, భవిష్యత్‌లో అనేక పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని, న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Read More
Next Story