
నేడు క్యాబినెట్..వీటిపైనే చర్చ
కారవాన్ పర్యాటక విధానం, ఆటో డ్రైవర్లకు రూ.15 వేల సాయం వంటి పలు కీలకమైన అంశాలపైన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. దాదాపు 20 అజెండా అంశాలపైన చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ (లిఫ్ట్) పాలసీ 2024–29కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జలవనరుల శాఖకు సంబంధించిన వివిధ పనులపై చర్చలు జరగనున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే, కొత్త పర్యాటక విధానంలో కారవాన్ పర్యాటకానికి ప్రత్యేక ఆమోదం ఇవ్వనున్నారు. ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వావిస్తున్నారు.
అమృత్ పథకం 2.0 పనులకు, అమరావతిలో వివిధ అభివృద్ధి పనుల వేగవంతానికి స్పెషల్ పర్పజ్ వెహికల్ (ఎస్పీవీ) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అమరావతి సహా రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలకు భూమి కేటాయింపులకు కూడా అనుమతి ఇవ్వబోతున్నారు. కుష్టు వ్యాధి పదాన్ని తొలగించే చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన, దానికి సంబంధించిన ఏర్పాట్లపైన కూడా ఈ క్యాబినెట్లో చర్చించనున్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు ప్రతిపాదనలతో పాటు, కార్మిక చట్టాల్లో ముఖ్య సవరణలకు మంత్రివర్గం లోక్ ఆమోదం అందించనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మరింత ఊతమిస్తాయని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలపై వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
Next Story