సంక్షేమ హాస్టళ్లు కాదు.. విద్యార్థుల పాలిట నరకకూపాలు!
x

సంక్షేమ హాస్టళ్లు కాదు.. విద్యార్థుల పాలిట నరకకూపాలు!

ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్నిఆదేశిస్తూ, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.


"రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు విద్యార్థులు నివసించడానికి యోగ్యంగా ఉన్నాయా లేక నరకకూపాలుగా మారాయా?" అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిధులు మంజూరవుతున్నా క్షేత్రస్థాయిలో కనీస వసతులు కల్పించడంలో వైఫల్యం చెందడంపై అసహనం వ్యక్తం చేస్తూ, మనుషులు ఉండలేని పరిస్థితుల్లో విద్యార్థులను ఉంచడం అమానుషమని వ్యాఖ్యానించింది. కొత్త ఏడాది మొదటి రోజైన 2026, జనవరి 1 (గురువారం) నాడు జరిగిన ఈ విచారణలో, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ హస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనలపై కాకినాడ జిల్లాకు చెందిన కీతినీడి అఖిల్ శ్రీగురు తేజ దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించిన ప్రధానాంశాలు..

మరణాల మృత్యుఘోష: 2016 నుండి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 45 మంది విద్యార్థులు మరణించడంపై కోర్టు దిగ్భ్రాంతి చెందింది. ఈ మరణాలకు బాధ్యులెవరని నిలదీసింది.
కాగితాలకే పరిమితమైన జీవోలు: జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు నెలకు రెండుసార్లు హాస్టళ్లలో బస చేయాలన్న జీవో (No. 46) కేవలం కాగితాలకే పరిమితమైందని, అధికారులు ఏరోజైనా రాత్రిపూట అక్కడ నిద్రించారా? అని ప్రశ్నించింది.
నిధుల మళ్లింపుపై అనుమానం: మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన రూ. 633 కోట్లు ఏమయ్యాయని, ఆ నిధులు విద్యార్థుల సౌకర్యాల కోసం కాకుండా కేవలం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయా? అని నిలదీసింది.
తక్షణ ఆదేశాలు: ప్రతీ నెలా విద్యార్థులకు మెడికల్ క్యాంపులు నిర్వహించాలని, మంచాలు, దుప్పట్లు, శుభ్రమైన తాగునీరు వంటి కనీస వసతులు కల్పించేలా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్నిఆదేశిస్తూ, తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
Read More
Next Story