వర్షపాతం తక్కువే కానీ నీటి సమస్య రాలేదు
x

వర్షపాతం తక్కువే కానీ నీటి సమస్య రాలేదు

భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.


గతేడాది ఇదే సమయంతో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం తక్కువుగా నమోదైందని, అయినప్పటికీ ఎక్కడా నీటి సమ్యస్య ఉత్పన్నం కానివ్వలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఇది కేవలం సమర్ధ నీటి నిర్వహణతోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనూ నీటి ఎద్దడి అనేది తలెత్తకూడదని... అన్ని కాలాల్లోనూ జల వనరులు సమృద్ధిగా లభించేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా లేకపోయినా, ఎగువ రాష్ట్రాల నుంచి వరద జలాలు రాకున్నా ఎలాంటి ఇబ్బంది రాకుండా నీటి నిర్వహణ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత జలాశయాల నిల్వలు, నీటి నిర్వహణ, ప్రాజెక్టుల పురోగతి, భూగర్భజలాలు...తదితర అంశాలపై గురువారం ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రస్తుతం 1,031 టీఎంసీల నీటి నిల్వలు
రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్‌ ప్రాజెక్టుల్లో మొత్తం 1,313 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుండగా ఇప్పటివరకు 1,031 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లో 79 శాతం నీరు నిల్వ ఉందని అన్నారు. సెప్టెంబర్‌ మొదటివారానికే ఈ స్థాయికి నిండాయని వివరించారు. ఇందులో శ్రీశైలం సహా మేజర్‌ ప్రాజెక్టుల్లో 89 శాతం మేర, మీడియం జలాశయాలు 57 శాతం, మైనర్‌ ప్రాజెక్టుల్లో 39 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. సోమశిల, కండలేరు, బ్రహ్మంసాగర్‌ నింపే విషయంలో సమస్యలను పరిష్కరించాలని సీఎం అన్నారు.
38,457 చెరువులు నింపేలా చర్యలు
రాష్ట్రంలో 38,457 చెరువులకు గాను...32,642 చెరువులను ఇంకా పూర్తిగా నింపాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని 497 చెరువులకు గాను 51 చెరువులు పూర్తిగా నిండాయని అధికారులు తెలిపారు. అన్ని చెరువులు వీలైనంత త్వరగా నింపగలిగితే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని 89,117 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే రూ.6,518 కోట్ల వ్యయమయ్యే ప్రాధాన్య ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. దీనిద్వారా 2,81,139 ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వడంతో పాటు, 3,38,326 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం సాధ్యపడుతుందన్నారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశంధార ప్రాజెక్ట్, సర్దార్‌ గౌతు లచ్ఛన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్ట్, తారకరామ తీర్థ సాగరం రిజర్వాయర్‌ ప్రాజెక్ట్, గాలేరు నగరి సుజల స్రవంతి పనుల పురోగతిపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. గాలేరు నగరి సుజల స్రవంతి 108 కి.మీ. మేర పూర్తి చేసి కడప వరకు నీటిని తీసుకువెళ్లేలా, పనులు నిలిచిన చోట్ల మళ్లీ టెండర్లు పిలిచి యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. రూ.1,686 కోట్లతో చేపట్టిన శ్రీశైలం డ్యామ్‌ రక్షణ పనులు, ఎస్కేప్‌ చానల్‌ పనులు శరవేగంగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనీ సూచించారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ. 2 వేల కోట్లు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయండి. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కోట్లు, వచ్చే ఏడాది మరో వెయ్యి కోట్లు ఇస్తాం. అటు పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌... ఇటు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. ఇలా రెండు వైపులా పంపులతో విశాఖ నగరానికి ఈ ప్రాజెక్టులు విస్తరించాలి. వంశధార, నాగావళి, చంపావతి అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతంలోని అన్ని రిజర్వాయర్లు నింపడం ద్వారా ఉత్తరాంధ్రలో వాటర్‌ నెట్వర్క్‌ ఏర్పాటు చేయాలి. ఇది ఉత్తరాంధ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఏలేరు పూర్తిగా నింపాలి. పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌ నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీటిని తరలించడానికి ఏలేరు ఎంతో కీలకమని అని సీఎం అన్నారు.
హెడ్‌ వర్క్స్‌ మినహా వరికపూడిసెల ఫేజ్‌ 1లో మిగిలిన అన్ని పనులు పూర్తి చేసి 24,900 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేందుకు సిద్ధం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. అలాగే ఫేజ్‌ 2 పనులకు సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సాధించాలని ఆదేశించారు. రెండు దశలు పూర్తి చేయడానికి రూ.1,925 కోట్లు వ్యయం కానుండగా, 84,281 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గతేడాదికన్నా ఈ ఏడాది రాష్ట్రంలో 1.25 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి సగటు భూగర్భజలాలు 8.43 మీటర్లుగా ఉన్నాయి. భూగర్భజలాలు 8 మీటర్ల కంటే దిగవకు ఉన్న 7,762 గ్రామాల్లో వాటి పెంపునకు ఫామ్‌ పాండ్స్, చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం వంటి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అలాగే భూగర్భ జలాల సమాచారం రియల్‌ టైమ్‌లో స్పష్టంగా తెలుసుకునేందుకు వచ్చే 3 నెలల్లో కొత్త సెన్సర్ల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ సమీక్షా సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story