ఏపీలో పన్ను ఎగవేతలు ఉండొద్దు
x

ఏపీలో పన్ను ఎగవేతలు ఉండొద్దు

విద్యుత్‌ వినియోగం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పన్ను ఎగవేతలను గుర్తించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పన్ను ఎగవేతలు ఉండొద్దని, అలా పన్నుల ఎగవేతలకు అవకాశం లేకుండా చూడాలని జీఎస్టీ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ వసూళ్లలో ఏపీ దేశానికి రోల్‌ మోడల్‌ గా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేంద్ర– రాష్ట్ర జీఎస్టీ అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్, రాష్ట్ర పన్నుల చీఫ్‌ కమిషనర్‌ ఏ బాబు, కేంద్ర రాష్ట్రాల జీఎస్టీ అధికారులు హాజరయ్యారు. డేటా అనలటిక్స్‌ లాంటి సాంకేతికతను వినియోగించి ఎగవేతలను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమర్ధవంతమైన పన్ను వసూళ్ల ప్రక్రియ ద్వారా జాతీయ సంపదను పెంచాలని సూచించారు. అది ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఉపకరించాలని అన్నారు. దీనికోసం జీఎస్టీ రియలైజేషన్‌ కోసం కేంద్ర– రాష్ట్రాల అధికారుల మధ్య సమాచార సమన్వయం ఉండాలన్నారు.

జీఎస్టీ వసూళ్లకు సంబంధించి పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా ఏపీ కార్యాచరణ ఉండాలని అన్నారు. వస్తున్న పన్ను వసూళ్ల సమాచారాన్ని డేటా అనలటిక్స్‌ ద్వారా విశ్లేషించాలని సూచించారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు విద్యుత్‌ వినియోగం లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రతీ వ్యవస్థ కూడా సమర్ధవంతంగా పని చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. పెట్టుబడులను ఆకర్షించటంలో ఏపీ దేశంలో 4 స్థానంలో ఉందన్నారు. అన్ని రంగాల్లోనూ ఏపీ బెస్ట్‌ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. గతంలో తాను హైదరాబాద్‌ ను అభివృద్ధి చేసినందు వల్లే ఆ రాష్ట్రానికి 75 శాతం మేర ఆదాయాన్ని తెచ్చిపెడుతోందన్నారు. ఏపీలోని విశాఖ, విజయవాడ, తిరుపతి లాంటి నగరాలు కూడా అదే స్థాయికి చేరుస్తామన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్లలో ఎక్కడా పొరపాటు జరక్కుండా చూసుకోవాలని సూచించారు.
త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమాచారాన్ని ఒకచోటకు చేర్చి డేటా లేక్‌ ను రూపొందిస్తుందని, ఈ సమాచారాన్ని కేంద్ర జీఎస్టీ అధికారులకూ అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన వనరులు సమృద్ధిగా ఉంటే ప్రతీ చిన్న అంశానికీ కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. సీఐఐ లాంటి సంస్థలతో కలిసి పన్ను ఎగవేతల్లేకుండా అవగాహన కల్పించాలన్నారు. అప్పటికీ అదుపులోకి రాకపోతే కఠినంగా వ్యవహరించాలన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో 3.4 శాతం వృద్ధి నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు. త్వరలోనే విశాఖ, విజయవాడల్లో ఏర్పాటు కానున్న జీఎస్టీ ట్రిబ్యునల్స్‌ ద్వారా పన్ను వివాదాలు పరిష్కారం అవుతాయని అధికారులు తెలిపారు. సెంట్రల్‌ జీఎస్టీ జోనల్‌ కార్యాలయం, క్వార్టర్ల నిర్మాణం కోసం అమరావతిలో 5 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్ర అధికారులు ముఖ్యమంత్రికి విన్నవించారు.
Read More
Next Story