
వైఎస్ జగన్ భద్రత భేష్ గా వుందన్నకేంద్ర ఇంటెలిజెన్స్
ఇప్పటికే జగన్ కు అదనపు సెక్యూరిటీ కొనసాగుతోందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వం సరిగా భద్రత కల్పించడం లేదన్న వైసీపీ నేతల వాదనలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కొట్టి పారేశాయి.ఇప్పటికే జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయగా,జగన్ భద్రత కు ఎలాంటి ముప్పు లేదని కేంద్రం ఇంటలిజెన్స్ బ్యూరో ఏపీ హైకోర్ట్ లో నివేదిక సమర్పించింది.
ఇటీవల కాలంలో జగన్ పర్యటనలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాయి. పల్నాడు పర్యటనలో జగన్ ప్రయాణించే వాహనం క్రిందపడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం సంచలనంగా మారింది.ఈ విషయంలో జగన్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఇదంతా తమ అధినేతకు రాష్ట్ర ప్రభుత్వం సరియైన భద్రత కల్పించక పోవడం వల్లే జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. జగన్ కూడా తన పర్యటనలలో భద్రతా వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యమంత్రికి పలు ప్రశ్నలు సంధిస్తూ ట్వీట్ చేశారు.
ఈ నేపధ్యంలో తన భద్రతపై జగన్ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు.తనకు జడ్ప్లస్ కేటగిరి భద్రతను పునరుద్దరించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేశారు. ఎన్ఎస్జీ లేదా సీఆర్పీఎఫ్ సిబ్బందితో సెక్యుూరిటీ కల్పించాలని పిటిషన్లో జగన్ కోరారు.ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.కాగా జగన్ భద్రతకు సంబంధించి హైకోర్టుకు కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో నివేదిక సమర్పించింది.జగన్ భద్రతకు ఎలాంటి ముప్పులేదని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో పేర్కొంది. హైకోర్టుకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఈ నివేదిక సమర్పించారు. ఇప్పటికే 58 మందితో జగన్కి జడ్ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చెప్పారు.ప్రభుత్వం సరియైన భద్రత కల్పించడం లేదన్న పిటీషనర్ వాదన సరికాదన్నారు.కాగా ఈ కేసు విచారణ జులై 15వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
మరోవైపు పోలీసు అధికారులు కూడా వైసీపీ ఆరోపణలను ఖండిస్తున్నారు.రాప్తాడు నియోజక వర్గంలో జగన్ పరామర్శకు వెళ్లిన సమయంలో 506 మందితో భద్రత కల్పించినట్లు చెబుతున్న అధికారులు,సత్తెనపల్లి, మిర్చియార్డు పర్యటన సమయంలోనూ అవసరమైన మేర భద్రత కల్పించినట్లు వెల్లడించారు. పులివెందులలో జగన్ ఇంటి వద్ద 71 మందితో భద్రత కల్పిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.
మొత్తంమీద జగన్ పర్యటనలలో భద్రతా వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. తన పర్యటనలు వివాదాలమయం అవుతుండటం , ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేస్తున్న దరిమిలా భవిష్యత్ లో ఎలా కార్యాచరణ వుండాలన్న దానిపైనా నేతలతో జగన్ చర్చిస్తున్నారు.
Next Story