వైజాగ్‌ స్టీల్‌లో మూడో పొయ్యి మళ్లీ వెలిగింది..!
x

వైజాగ్‌ స్టీల్‌లో మూడో పొయ్యి మళ్లీ వెలిగింది..!

విశాఖ ఉక్కు కర్మాగారంలో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ శుక్రవారం నుంచి పునః ప్రారంభమైంది. దీంతో మరో ఎనిమిది వేల టన్నుల ద్రవపు ఉక్కు ఉత్పత్తికి మార్గం సుగమమైంది.


విశాఖ ఉక్కు కర్మాగారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు పది నెలల క్రితం మూతపడిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3 శుక్రవారం పునఃప్రారంభమైంది. అన్నపూర్ణగా పిలిచే ఈ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ అందుబాటులోకి రావడంతో ఉక్కు ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాదు.. అది సవ్యంగా నడిస్తే లాభాలను తెచ్చిపెడుతుంది. ఇదే ఇప్పుడు ఈ ప్లాంట్‌ భవితవ్యంపై మిణుకు మిణుకుమంటున్న ఆశలకు మళ్లీ జీవం పోస్తోంది.


బ్లాస్ట్‌ ఫర్నేస్‌ –3

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో మూడు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లున్నాయి. వీటిలో రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌లు మాత్రమే నడుస్తున్నాయి. ముడి సరకు కొరతతో పాటు కూలింగ్‌ ప్లేట్లు దెబ్బతినడంతో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ గత ఏడాది సెప్టెంబర్‌ 12న మూతపడింది. అప్పట్నుంచి మిగతా రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల నుంచే ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. వీటి ద్వారా రోజుకు 15–16 వేల టన్నుల ద్రవపు ఉక్కు ఉత్పత్తి అవుతోంది. ప్లాంట్‌లో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను ప్రారంభించాలని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు చాన్నాళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు. వీరి డిమాండ్‌కు తలొగ్గి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3 అన్నపూర్ణను పది నెలల తర్వాత పు#నఃప్రారంభించింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌తో రోజుకు అదనంగా ఏడెనిమిది వేల టన్నులు అంటే.. 22–24 వేల టన్నులకు ద్రవపు ఉక్కు ఉత్పత్తి పెరగనుంది. దీని నుంచి రోజుకు ఫినిష్డ్‌ స్టీలు 18 వేల టన్నుల వరకు తయారవుతుంది.
‘అన్నపూర్ణ’ గతంలోనూ ఆగింది..
కాగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3 అన్నపూర్ణ గతంలోనూ కొన్నిసార్లు ఆగింది. ఈ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను 2012 ఏప్రిల్‌ 24న ప్రారంభించారు. ఆ తర్వాత 2020 కరోనా సమయంలో దీని ద్వారా ఉత్పత్తిని నిలిపివేశారు. తిరిగి 2020 అక్టోబర్‌ 30 నుంచి మళ్లీ ఉత్పత్తిని మొదలు పెట్టారు. 2022 జనవరి 28న ముడి సరకు కొరతతో మళ్లీ మూసివేసి 2023 డిసెంబర్‌ 30న తిరిగి తెరిచారు. అనంతరం 2024 సెప్టెంబర్‌ 12న మరోసారి ముడి సరకు కొరత కారణంతో ఈ బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3ని మూసివేశారు.
ముడి సరుకుపై అనుమానాలు..
ఈ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల్లో మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారన్న ఆనందం ఒకపక్క ఉంటే.. అందుకవసరమైన ముడి సరకుపై ఆందోళన మరోపక్క వ్యక్తమవుతోంది. గతంలో ఈ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూత పడడానికి ప్రధాన కారణాల్లో ముడి సరకు (రా మెటీరియల్‌) కొరత ఒకటి. ప్రస్తుతం ప్లాంట్‌లో ముడిసరకు నిల్వలు వారం పది రోజుల వరకే ఉన్నాయని చెబుతున్నారు. అలాంటప్పుడు ఈ కొరతను ఎలా అధిగమిస్తారన్న అనుమానాలున్నాయి. అయితే ముడి సరకు కొరత రానీయకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటోందన్న వాదనలూ ఉన్నాయి. ఇందుకోసం ఎన్‌ఎండీసీ/ సెయిల్‌ నుంచి గాని, లేదా ప్రైవేటు సంస్థల నుంచి గాని రా మెటీరియల్‌ కొనుగోలు చేస్తారని అంటున్నారు. సెయిల్, ఎన్‌ఎండీసీల నుంచి కొనుగోలు చేసే ముడి సరకు నాణ్యంగా ఉంటుందని, అదే ప్రైవేటు సంస్థల నుంచి అంతగా నాణ్యత లేని ముడి సర కును కొనుగోలు చేస్తే ప్లాంట్‌కు నష్టం వాటిల్లుతుందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే లాభాల బాట పట్టిన ఉక్కు..
నష్టాల ఊబిలో చిక్కుకుందన్న బూచిని చూపి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్నట్టు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది. నాలుగున్నరేళ్ల క్రితం ఈ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరణకు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అప్పట్నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులు నిరవధికంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు అనూహ్యంగా ఈ స్టీల్‌ ప్లాంట్‌ నష్టాల నుంచి లాభాల బాటలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం బ్లాస్ట్‌ ఫర్నేస్‌–1, 2లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఈ రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారానే ఈ ఏడాది మార్చిలో రూ.18 కోట్లు, ఏప్రిల్‌లో రూ.71 కోట్లు, మే నెలలో రూ.50 కోట్లు వరకు క్యాష్‌ ప్రాఫిట్‌ వచ్చినట్టు కార్మిక నాయకులు చెబుతున్నారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3తో ఉత్పత్తి మరింత పెరిగి మరిన్ని లాభాలు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జీతాల బకాయిలు చెల్లింపులపై ఆశలు..
కష్టాలు, నష్టాల నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం గత సెప్టెంబర్‌ నెల నుంచి సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. ఇలా ఇప్పటివరకు సుమారు రూ.250 కోట్లు (280 శాతం) జీతాల బకాయి, పీఎఫ్, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సుల బకాయి మరో రూ.300 కోట్ల వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల బాట పట్టడం, మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ పునఃప్రారంభం కావడం వంటి సానుకూల పరిణామాలతో తమ జీతాలు, ఇతర బకాయిలు చెల్లింపులు జరుగుతాయని ప్లాంట్‌ కార్మికులు కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఆదినారాయణ

తొలగించిన వారిని తిరిగి తీసుకోవాలి..
వివిధ కారణాలు చెబుతూ ఉక్కు యాజమాన్యం నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను విధుల నుంచి అన్యాయంగా తొలగించింది. వారంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఉక్కు కర్మాగారం నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. ఉక్కు ఉత్పత్తి కూడా మెరుగ్గా ఉంది. తాజాగా బ్లాస్ట్‌ ఫర్నేస్‌–3 కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ పరిస్థతుల్లో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకోవాలి’ అని ఉక్కు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు.
Read More
Next Story