
‘జీరో కరెప్షన్ ఏపీ’ ప్రధాన లక్ష్యం
ఐవీఆర్ఎస్ ప్రజాభిప్రాయ సేకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
‘జీరో కరప్షన్ ఏపీ’నే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరు, ఎక్కడ అవినీతికి పాల్పడినా సహించేది లేదన్నారు. అవినీతి ఆరోపణలు రుజువైతే తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏడాది పాలనపైన, పథకాల అమలు తీరు మీద ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలపై శనివారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అత్యధిక స్థాయిలో ఏడాది కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఐవీఆర్ఎస్, సీఎస్డీఎస్ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి స్థాయిలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వర్క్ ఫ్రమ్ హోమ్, పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలన్నారు.
175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర కింద అందించాలన్నారు. రేషన్ షాపులను పెంచడం, రేషన్ సరుకులకు బదులుగా నగదు, లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఉచితక ఇసుకపై కూడా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు.
సర్వేల్లో సంతృప్తుల శాతం ఇలా..
ఐవీఆర్ఎస్, సీఎస్డీఎస్ ఫీల్డ్ సర్వేలో ప్రజల అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ౖ అవినీతి లేదని 85 శాతం మంది, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 83.9 శాతం మంది ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎస్డీఎస్ ఫీల్డ్ సర్వేలో లబ్ధిదారులను నేరుగా కలిసి అడిగినప్పుడు పింఛన్ల పింపిణీలో అవినీతి లేదని 93.9 శాతం మంది, ఇంటిదగ్గరే ఇస్తున్నారని 93.3 శాతం, ఉద్యోగుల ప్రవర్తన బావుందని 73.3 శాతం మంది, పర్వాలేదని 23.1 శాతం మంది వెల్లడించారు.
అన్నాక్యాంటీన్లు పరిశుభ్రంగా ఉన్నాయని 80.5 శాతం, ఆహారం నాణ్యత బావుందని 79.3 శాతం, సమయపాలన పాటిస్తున్నారని 80.8 శాతం మంది వెల్లడించారు. ఆసుపత్రుల సేవలకు సంబంధించి క్వాలిటీ చెకప్పై 68.4 శాతం, రక్త పరీక్షలపై 55 శాతం, ఉచిత మందుల పంపిణీపై 65.5 శాతం, సిబ్బంది ప్రవర్తనపై 71.3 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ౖ రోజూ చెత్త సేకరణపై 68.1 శాతం, 24 గంటల్లో చెత్త డంప్ తరలింపుపై 57 శాతం సంతృప్తి చెందినట్లు అభిప్రాయపడ్డారు.
ౖ ఆలయాల్లో సౌకర్యాలకు సంబంధించి దర్శనం బావుందని 68 శాతం, సౌకర్యాలు బావున్నాయని 63.6 శాతం, ప్రసాదం నాణ్యత బాగుందని 77.7 శాతం భక్తులు చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీలో శుభ్రత, సీటింగ్ విషయంలో 53.4 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. నీటి సౌకర్యం బాగుందని 45.2 శాతం, టాయిలెట్స్పై 56 శాతం, బస్సు సమయం–రూట్ వివరాలపై 61.5 శాతం, బస్సులు సమయానికి బయల్దేరుతున్నాయని 69 శాతం, సమయానికి చేరుకుంటున్నామని 69.7 శాతం, సిబ్బంది ప్రవర్తన బావుందని 72.4 శాతం, రక్షణ కలిగి ఉన్నాయని 69.7 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఎక్కువ డబ్బు వసూళ్లు చేయడం లేదని 62.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. నెలనెలా రేషన్ సరుకులు తీసుకుంటున్నామని 75.1 శాతం, నాణ్యత బావుందని 73.8 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎరువుల లభ్యత ఉందని 60.9 శాతం మంది, సమయానికి విత్తనాల సరఫరా ఉందని 63 శాతం రైతులు అభిప్రాయపడ్డారు. తమ ప్రాంతంలో డ్రగ్స్ సంబంధిత సమస్య ఉందని 27.4 శాతం, పోలీసులు స్పందిస్తున్నారని 54.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ప్రాంతాల్లో వేధింపులు ఉన్నాయని 27.8 శాతం, పోలీసుల స్పందన బావుందని 59.5 శాతం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని 56.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. స్లాట్ బుకింగ్ ప్రాసెస్పై 63.4 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి లేదని 62.3 శాతం మంది అభిప్రాయపడ్డారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్పై 70.6 శాతం, లభ్యతపై 67.5 శాతం, ధర పైన 61.1 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
రెవెన్యూ సేవలకు సంబంధించి ఎఫ్ లైన్పై ఎక్కువ డబ్బులు వసూళ్లు చేయడం లేదని 77.4 శాతం, పాస్బుక్ సర్వేలో ఎక్కువ మొత్తం తీసుకోలేదని 75.1 శాతం అభిప్రాయపడ్డారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతోందని 61.6 శాతం, ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోందని 56.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి అడ్మిషన్లపై 86.2 శాతం, సేవలపై 81.3 శాతం, ఆరోగ్య మిత్ర సాయంపై 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతి లేదని 78.5 శాతం మంది అభిప్రాయపడ్డారు.
Next Story