
కేశినేని బ్రదర్స్ మధ్య రగులుతున్న చిచ్చు
కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన తమ్ముడు కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా ఉన్నారు.
ఎన్నికల తర్వాత సమసి పోయిందనుకున్నకేశినేని సోదరుల మధ్య వివాదం తాజాగా రగులుకుంటోంది. సోషల్ మీడియా వేదికగా ఇద్దరు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇది పెరిగి పెద్దదై ఎటువైపునకు దారితీస్తుందో అని కేశినేని అభిమానులు చర్చించుకుంటున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లోనే విజయవాడ కేశినేని బ్రదర్స్ ఓ స్పెషల్. జేసీ బ్రదర్స్, ఆనం బ్రదర్స్ మాదిరిగానే కేశినేని బ్రదర్స్ కూడా రాజకీయాల్లో మంచి పేరుంది. అయితే కేశినేని సోదరుల్లో తప్ప తక్కిన వారిలో పొరపుచ్చాలు రాలేదు.. రోడ్డుకెక్కలేదు. 2024 ఎన్నికల వాతావరణం కేశినేని బ్రదర్స్ మధ్య సోదర భావం మారిపోయింది. ఎన్నికల కంటే ముందే వారి అన్యోన్యం పటాపంచలైంది. వ్యాపార లావాదేవీలతో మొదలైన వారి వివాదం అంతటితో ఆగలేదు. అది కాస్తా పెరిగి పెద్దదైంది. రాజకీయ ఆధిపత్యం, రాజకీయ పదవుల కోసం ఇరువురు రోడ్డెకెక్కారు. వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే స్థాయికి వారి వివాదాలు చేరుకున్నాయి.
2024 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారి చెరో పార్టీ నుంచి ఎన్నికల రణరంగంలోకి దిగారు. వైసీపీ నుంచి రంగంలోకి దిగిన అన్న కేశినేని నాని ఓడిపోగా, టీడీపీ నుంచి పోటీ చేసిన తమ్ముడు కేశినేని చిన్ని గెలిచారు. ఫలితాల తర్వాత రాజకీయాలకు దూరంగ ఉంటానంటూ కేశినేని నాని ప్రకటించారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అధికారంలో ఉన్న టీడీపీపై కేశినేని నాని విరుచుకు పడుతున్నారు. టీడీపీపైన, ఆ పార్టీ ఎంపీ కేశినేని చిన్నిపైన ఓ రేంజ్లో విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులకు భూములు ఇచ్చిన ఉర్సా క్లస్టర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని బినామీ అంటూ సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని విమర్శలు గుప్పించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
"NTR BHAVAN-vIJAYAWADA"
ఇది విజయవాడ ప్రజలు చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించుకున్నారు అని గర్వగంగా చెప్పుకునే ప్రజా ప్రతినిధిగారి కార్యాలయం పేరు. కానీ ఇక్కడ కూర్చుని ఆయన చేసేది..ఇసుక వ్యాపారం. ఫ్లై యాష్ తోలకం. గ్రావెల్ అమ్మకం. భూ దందాలు. బ్రోకరేజీలు. పేకాట గృహాలు. రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వైగారా..వగైరా
ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజల ఆరాద్య దైవం. నీతికి నిజాయితీకి మారు పేరు. ప్రజా సేవ అంటే చాలా పవిత్ర కార్యక్రమం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. కాబట్టి నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి "CHARLES SOBHARAJ BHAVAN" అని పెడితే బాగుంటుందని నిన్ను భారీ మెజారిటీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక. అంటూ ఘాటుగా కేశినేని నాని, తన తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ ఫొటోను కూడా షేర్ చేశారు.
దీనికి కేశినేని నాని సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. అదే సోషల్ మీడియా వేదికగా ధీటుగా సమాధానం ఇచ్చారు. మతి బ్రమించి రోడ్లపైన తిరుగుతున్న ఓ సైకోగా తన అన్న కేశినేని నానిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే..
ఎన్టీఆర్ జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక
సోషల్ మీడియా రోడ్ల మీద మతి బ్రమించి తిరుగుతున్న సైకో. చిప్పు దొబ్బి సోషల్ వాల్స్పై కసీ, పగ, ద్వేషంతో రగిలిపోతూ విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకో.. స్పందించాల్సిన అవరం లేదు. అప్రమత్తంగా ఉండండి...!
ఇట్లు కేశినేని శివనాథ్(చిన్ని)
విజయవాడ పార్లమెంట్ సభ్యులు అంటూ అదే సోషల్ మీడియా వేదికగా అన్న కేశినేని నానిపై, తమ్ముడు కేశినేని చిన్ని ఓ రేంజ్లో ఝలక్ ఇచ్చారు. ఇది ముదిరి పాకానపడి ఏ రూపం దాల్చుతుందో అని విజయవాడ స్థానికులు చర్చించుకుంటున్నారు.
Next Story