
అందుకే అమరావతిలో వాజ్ పేయి స్మారకం
ప్రతీ రోజూ ఓ మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశం మెచ్చిన నేతగా మాజీ ప్రధాని వాజ్ పేయి చిరస్మరణీయులని, అందుకే ఆయన స్మారకాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో గురువారం వాజ్ పేయి విగ్రహం ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిలో అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచం అంతా గుర్తించేలా అమరావతిని తీర్చిదిద్దటమే మా ధ్యేయం. స్పూర్తిదాత వాజ్ పేయి స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మించడానికి ఇక్కడి రైతుల త్యాగమే స్పూర్తి. చరిత్ర గుర్తించే విధంగా అటల్ బిహారీ వాజ్ పేయికి ఘనమైన నివాళి ఇవ్వాలనే స్మృతి వనం నిర్మిస్తున్నాం. అటల్ ,మోదీ సుపరిపాలనా యాత్ర బీజేపీ ప్రారంభించింది. 26 జిల్లా కేంద్రాల్లో అటల్ విగ్రహాలను ప్రతిష్టించేలా కూటమి సంయుక్తంగా పనిచేసిందని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతిలో వాజ్ పేయి విగ్రహంతో పాటు ఆయన చరిత్ర, సుపరిపాలనను ప్రజలకు తెలిసేలా స్మృతివనం ఏర్పాటు చేస్తున్నాం. సుపరిపాలన దివస్ గా అటల్ జీ జన్మదినాన్ని నిర్వహించుకుంటున్నాం. తెలుగు నేలలో అలాంటి స్పూర్తి ఇచ్చే నేత ఎన్టీఆర్. వీరంతా చరిత్రను తిరగరాసిన నేతలు. నేషనల్ ఫ్రంట్ ద్వారా కాంగ్రేసతర పార్టీలను ఏకం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. వాజ్ పేయి ఎన్టీఆర్ మధ్య సుదీర్ఘ అనుబంధం ఉంది. జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేసిన ప్రయాణం కూడా అత్యంత కీలకం. మంచి వక్త, కవిగా, ప్రజాహృదయ నేతగా అటల్ బిహారీ వాజ్ పేయి దేశ మౌలిక సదుపాయాలకు బలమైన పునాది వేశారు. వాజ్ పేయి ప్రతిపాదించిన గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారిని మొట్టమొదట తడ -చెన్నైల మధ్యే ప్రారంభించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
నాలెడ్జి ఎకానమీకి వెన్నెముక టెలికామ్ సెక్టార్ ను డీరెగ్యులేషన్ ప్రారంభించి ప్రగతికి పునాది వేశారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ 4జీ రివల్యూషన్ తో ముందుకు దూసుకెళ్తున్నారు. పీపీపీ విధానంలో దేశాభివృద్ధికి బీజం వేసి ఆచరణలో పెట్టి ఇప్పుడు అగ్రస్థానానికి తీసుకెళ్తున్నాం. ఓపెన్ స్కై పాలసీ, నగరాల మధ్య రహదారులు లాంటి వివిధ సంస్కరణలు దేశ ప్రగతికి కీలక బిందువుగా నిలిచాయి. దేశాన్ని అణుశక్తిగా మార్చి ప్రపంచానికి భారతీయుల సత్తా చాటిన ధీశాలి అప్పటి ప్రధాని వాజ్ పేయి. అప్పటి కార్గిల్ యుద్ధంలో వాజ్ పేయి, ఇప్పుడు సింధూర్ లో ప్రధాని మోదీ భారత్ వైపు ఎవరైనా చూస్తే తగిన బుద్ధి చెబుతామని చాటారని చంద్రబాబు అన్నారు.
మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, దార్శనిక నేత వాజ్ పేయి ఇద్దరూ దేశం కోసం పని చేసిన నేతలు. ఎన్టీఆర్ లాంటి నేతల్ని కూడా గుర్తుంచుకునేలా అమరావతిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తాం. 11 స్థానంలో ఉన్న భారత్ ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలతో అగ్రస్థానానికి చేరుకోబోతోంది. 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి వస్తుంది. దేశాన్ని శిఖరాగ్రంలో నిలిపే శక్తి ప్రధాని మోదీకి ఉంది. అమరావతిలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం. రాజధాని నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. గేరు మార్చి పనుల్ని వేగవంతం చేస్తాం. నాడు ప్రధాని హోదాలో హైటెక్ సిటీకి అటల్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు అమరావతిలో క్వాంటం వ్యాలీని నిర్మిస్తున్నాం. అప్పుడు ఐటీ స్పీడు, ఇప్పుడు క్వాంటం జోరు నడుస్తోందన్నారు.
హైవేలు, పరిశ్రమలు, ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోంది. గత పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. ఇప్పుడు కోలుకుని అభివృద్ధి ప్రయాణం మొదలు పెట్టింది. పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు మోకాలడ్డుతున్నారు. మెరుగ్గా ప్రాజెక్టు నిర్మితం కావాలంటే పీపీపీ ద్వారానే వేగంగా జరుగుతుంది. గత 30 ఏళ్లుగా ఇదే నిరూపితం అయింది. పీపీపీ పద్దతిలో చేపట్టే మెడికల్ కాలేజీల నిర్మాణానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఆర్ధిక మద్దతు కూడా ఇస్తున్నాం. పీపీపీ అంటే ప్రైవేటు కాదు ప్రభుత్వ ఆస్తే. దానిని నిర్వహించి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తారు. కాలేజీలు కడితే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు... అలాంటి వ్యక్తుల నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వాజ్ పేయి లాంటి ఉన్నత నాయకులతో రాజకీయం చేసి.. ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయం చేయటం సిగ్గు అనిపిస్తోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ అభివృద్ది యాత్ర అగదు. సంపద ఆరోగ్యం, ఆనందం ప్రజలకు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గతంలో వాజ్ పేయి ఇప్పుడు నరేంద్ర మోది స్పూర్తిని ఇస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Next Story

