
అదే మరి పవన్ కల్యాణ్ నిబద్దత అంటే!
సెలైన్ డ్రిప్తోనే ఆర్థిక సంఘం ప్రతినిధుల భేటీకి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇది కాస్త నెట్టింట వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. అది పొత్తుల విషయంలోనైనా, తన పార్టీతో పాటు కూటమిని గెలిపించడంలోనైనా ఆయన అనుసరిస్తున్న విధానం ఎవరకీ అంతుబట్టలేకుండా ఉంది. ఊహించని రీతిలో ఏపీ రాజకీయాల్లో ముందడుగు వేస్తున్నారు.
మరో వైపు పవన్ కల్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన సిన్నియారిటీని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. తాను ఇంటర్తోనే చదువు ఆపేశానని, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చదువు విలువ తెలిసొచ్చిందని, అదే తాను బాగా చదువుకుని ఉండి ఉంటే, కనీసం డిగ్రీ వరకైనా చదువుకుని ఉండి ఉంటే ఫైళ్లను అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉండేదని, తాను ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాననే విషయాన్ని పక్కన పెట్టి, ఎలాంటి భేషజాలకు పోకుండా తన చదువు గురించి వేలాది మంది సమక్షంలో వెల్లడించారు.
తాజాగా మరో సారి అంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల తన కమిట్మెంట్ను, తన సిన్సియారిటీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరు కావడంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయననే సంకేతాన్ని ఇండైరెక్టుగా ఇచ్చారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ బుధవారం జరిగిన 16వ ఆర్థిక సంఘం ప్రతినిధుల భేటీకి హాజరయ్యారు. అప్పటికే రెండు రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పవన్ కల్యాణ్ దానిని లెక్క చేయకుండా ప్రభుత్వ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి వరకు సెలైన్ ఎక్కించుకున్న పవన్ కల్యాణ్, దానిని పక్కన పెట్టి, తన చేతికి ఉన్న సెలైన్ డ్రిప్తోనే సమావేశానికి హాజరయ్యారు. అలాగే ఆ సమావేశం పూర్తి అయ్యేంత వరకు ఉండి తన నిజాయితీని చాటుకున్నారు.
అంతకుముందుకు మంగళవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం నాటికే ఆయన అస్వస్థతో ఉన్నారు. అయినప్పటికీ కేబినెట్ భేటీకి హాజరయ్యారు. అయితే పూర్తి సమయం ఉండలేక పోయారు. తన ఆరోగ్యం సహకరించక పోవడంతో మధ్యలోనే కేబినెట్ భేటీ నుంచి తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఇక బుధవారం ఆర్థిక సంఘం ప్రతినిధులతో కీలక భేటీ కావడంతో, దానిని తోసి పుచ్చలేక తన చేతికి ఉన్న సెలైన్ డ్రిప్తోనే హాజరు కావలసి వచ్చింది. సెలైన్ డ్రిప్తోనే ఈ భేటీకి హాజరైన ఫొటోలు నెట్టింట వైరల్గా మారడంతో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు ఓ రేంజిలో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పవన్ కల్యాణ్ కమిట్మెంట్ అంటే అలా ఉంటుందని కామెంట్లు చేస్తుంటే, మరి కొందరు పవన్ కల్యాణ్ ఆరోగ్యానికి ఏమైందని ఆరా తీస్తూ, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఇటీవల తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడినా, ఈ సంఘటన పవన్ కల్యాణ్ను మానసికంగా బాగా కుంగదీసింది. తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీని వల్ల పవన్ కల్యాణ్ ఆరోగ్యం కాస్త దెబ్బతినిందని జనసేన శ్రేణులు చర్చించుకుంటున్నారు.
Next Story