విశాఖ చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్.. యోగా డే. శనివారం పదకొండవ అంతర్జాతీయ యోగా డేకి వైజాగ్ వేదిక అయింది. ఐదు లక్షల మందితో యోగాసనాలు చేయించడం ద్వారా గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నించడం, దీనికి ప్రధాని మోదీ హాజరు కానుండడం ఈ వేడుక ప్రత్యేకత. దాదాపు నెల రోజుల నుంచి యోగా డే కోసం అధికార యంత్రాంగం శ్రమిస్తోంది. యోగాసనాల కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తున్నారు. యోగా డేలో పాల్గొనే పేర్లను ఇప్పటికే రిజిస్టర్ చేశారు. ఈ యోగాసనాల్లో వారిని మాత్రమే అనుమతిస్తారు. ఇతరులను అనుమతించరు. సాగరతీరంలోని ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్లు, అదనంగా 34 పరసరాలను కలుపుకుని మరో నాలుగు కిలోమీటర్లు వెరసి 30.6 కి.మీల మేర యోగాసనాలకు ఏర్పాట్లు చేశారు. బీచ్ రోడ్డులో 3.19 లక్షలు, దానికి అనుకుని ఇతర ప్రదేశ్లాలో 1.80 లక్షల మంది యోగాసనాలు చేసేలా చర్యులు తీసుకున్నారు. యోగాసనాలకు 326 కంపార్టుమెంట్లను సిద్ధం చేశారు. ఒక్కో కంపార్టుమెంటులోకి వెయ్యి మందిని అనుమతిస్తారు. వీరు నేరుగా కంపార్టుమెంట్ల వద్దకు బస్సులో చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఏ కంపార్టుమెంటు, సీటింగ్ నంబరు వంటివి కేటాయించారు. దానిని బట్టి వారు నేరుగా తమకు కేటాయించిన కంపార్టుమెంట్లకు వెళ్లి యోగసనాలు చేస్తారు. పర్యవేక్షణకు కంపార్టుమెంటుకు ఒక డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు యోగా శిక్షకులు, పది మంది వలంటీర్లు, ఒక ఏఎన్ఎం, ఒక ఆశావర్కరు చొప్పున ఉంటారు. కంపార్టుమెంట్లకు సమీపంలోనే 4500 తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే వారి కోసం 9,995 వాహనాలను సిద్ధం చేశారు. వీటిలో మూడు వేలు ఆర్టీసీ బస్సులు. ఈ వాహనాలకు నగరంలో 75 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం నగరంలో వసతి ఏర్పాటు చేశారు. ఇంకా 307 ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, 50 మెడికల్ క్యాంపు, మూడు పది పడకల ఆస్పత్రులు, 116 అంబులెన్సులను సిద్ధం చేశారు. కాగా యోగాభ్యాసకులు శనివారం వేకువజామున 5.30 గంటలకల్లా తమకు కేటాయించిన కంపార్టుమెంట్లకు చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించరు. మరోవైపు శనివారం ఉదయం వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో యోగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
సిద్ధమవుతున్న ప్రధాన వేదిక
3.50 లక్షల మ్యాట్లు.. 5 లక్షల టీ షర్టులు..
యోగాసనాలు చేసే వారికి 3.50 లక్షల మ్యాట్లను, ఐదు లక్షల టీ షర్టులను ఉచితంగా అందిస్తారు. అలాగే వీరికి రెడీమేడ్ స్నాక్స్, రెండు టాటా గ్లూకోజ్ ప్యాకెట్లు, శనగ పలుకుల చిక్కీ, కేక్, బిస్కట్ ప్యాకెట్టు, వాటర్ బాటిల్ అరటిపండు/ బత్తాయి పండు ఇస్తారు.
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న బీచ్ రోడ్డు
గిరిజన పిల్లలతో సూర్య నమస్కారాలు.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన 26,395 మంది గిరిజన విద్యార్థినీ విద్యార్థులతో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఒకేసారి శుక్రవారం సాయంత్రం 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేస్తారు. దీనిని కూడా గిన్నిస్ బుక్లో నమోదు చేసే అవకాశం ఉంది.
యోగాసనాలు చేస్తున్న విదేశీ విద్యార్థులు
యుద్ధ విమానాల విన్యాసాలు..
యోగాంధ్ర ప్రధాన వేదిక ఆర్కే బీచ్కు ప్రధాని నరేంద్ర మోదీ చేరుకుని యోగాసనాల ప్రారంభానికి ముందు (ఉదయం 6.31 గంటలకు) తూర్పు నావికాదళ యుద్ధ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. అలాగే పదకొండు యుద్ధ నౌకల్లో నావికాదళ సిబ్బంది కూడా యోగాసనాలు చేస్తారు. కాగా ప్రధాన వేదిక ప్రాంతాన్ని ఎస్పీజీ ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకుంది. మరోవైపు యోగా డే కార్యక్రమానికి 175 దేశాల ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు.
ఈ సాయంత్రమే ప్రధాని రాక
ప్రధాని మోదీ బీహార్ పర్యటనను ముగించుకుని శుక్రవారం ఒడిశాలోని భువనేశ్వర్ చేరుకుంటారు. అక్కడ నుంచి బయల్దేరి సాయంత్రం 6.45 గంటలకు విశాఖ ఐఎన్ఎస్ డేగాకు వస్తారు. ప్రధానికికి ఆహ్వానం పలికే జాబితాలో విశాఖకు చెందిన పహల్గాం బాధిత కుటుంబాన్ని కూడా చేర్చారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన చంద్రమౌళి సతీమణి నాగమణి పేరును జత చేశారు. ప్రధాని ఒక రోజు ముందే విశాఖ వస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు కూడా శుక్రవారం సాయంత్రానికి వైజాగ్ చేరుకుంటున్నారు.
యోగాసనాలు 45 నిమిషాలు..
యోగా డే సందర్భంగా తొలుత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి జాదవ్ ప్రతాప్రావు గణపతిరావు నాలుగు నిమిషాలు ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రెండు నిమిషాలు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నిమిషాల పాటు మాట్లాడతారు. అనంతరం ప్రధాని 15 నిమిషాలు ప్రసంగిస్తారు. ఇలా 7 గంటకల్లా ప్రసంగాలు ముగించి 7.45 గంటల వరకు 45 నిమిషాలు యోగాసనాలు ప్రారంభిస్తారు. కాగా వచ్చిన వారితో పాటు ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా యోగాసనాలు చేస్తారు. ఎనిమిది గంటలకు యోగా కార్యక్రమం ముగిశాక యోగా పోటీల విజేతలను ప్రధాని అభినందిస్తారు. అనంతరం ప్రధాని ఏయూ మైదానానికి వెళ్లి అక్కడ గిరిజన విద్యార్థినీ విద్యార్థులు చేసే సూర్య నమస్కారాలను తిలకిస్తారు. ఆ తర్వాత ప్రధాని తాను బస చేసిన నేవీ గెస్ట్ హౌస్కు వెళ్తారు.
12 వేల మందితో బందోబస్తు..
శనివారం యోగా డే సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులేర్పడకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 12 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 1200కు పైగా సీసీ కెమెరాలతో పాటు 30 డ్రోన్లతో నిరంతర నిఘాను కొనసాగిస్తున్నారు. కమాంyŠ కంట్రోల్ రూమ్తో సీసీ కెమెరాలను అనుసంధానించి పర్యవేక్షిస్తారు. వివిధ జిల్లాల నుంచి విశాఖ నగరంలోకి వచ్చే వాహనాలను నియంత్రించారు. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను నిర్దేశించారు. నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో యోగా డే ప్రధాన వేదిక ఏర్పాటు చేసినందున రెండు రోజుల నుంచి అటు వైపు వాహనాలను అనుమతించడం లేదు. కేవలం నిర్దేశిత పాస్లున్న వారినే అనుమతిస్తున్నారు.