ఉగ్రవాదులను ఏరి పారేయాలని మధుసూదన్ కుటుంబ సభ్యులు అన్నారు. ఉగ్రవాదులు లేకుండా బుద్ది చెప్పాలని, ఉగ్రవాదుల చేతిలో మరెవ్వరూ కూడా ప్రాణాలు కోల్పోకూడదని, దీనిపై భారత దేశం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. పాకిస్తాన్ తీవ్ర వాదుల స్థావరాలపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలి సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ తల్లి పద్మావతి మాట్లాడుతూ.. తనకు కలిగిన కడుపుకోత భవిష్యత్లో ఏ తల్లి పడకూడదు. ఉగ్రవాదులను అంతం చేయాలి. ఎన్ని యుద్దాలు చేసినా నా కొడుకును తీసుకొని రాలేరు. నా కొడుకు అమాయకుడు. ఉగ్రవాదులు నా కుటుంబానికి తీరని ద్రోహం చేశారు. అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన కొడుకులాగా మరెవ్వరూ కూడా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోకూడదని, ఆ విధంగా భరత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పద్మావతి కోరారు.
మధుసూదన్ మామ వెంకటసుబ్బయ్య మాట్లాడూతూ.. అమాయకులను బలి తీసుకుంటున్న ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, దీని కోసం భారత దేశం మరింతగా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అందమైన ప్రదేశాలను చూసి ఆస్వాదించేందుకు వెళ్లిన అమాయకులైన పర్యాటకులను అన్యాయంగా పొట్టనపెట్టుకున్న ఉగ్ర మూకలకు గట్టిగా బుద్ది చెప్పాలని, వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
పహల్గాం ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ.. మా ఇంటికి పెద్ద దిక్కు అయిన నా అన్నను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ఇంటి పెద్ద దిక్కు అయిన నా అన్నను కోల్పోవడం మా కుంబానికి తీరని లోటు. ఇప్పటికీ ఆ షాక్లో నుంచి తేరుకోలేక పోతున్నాం. పాకిస్తాన్లోని ఉగ్ర వాదుల స్థావరాలపై భారత దేశం సైనిక బలగాలు చేపట్టిన దాడులు మా కుటుంబానికి ఎంతో ఊరటను కలిగిస్తోంది. అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గాం ఉగ్ర దాడుల్లో అన్యాయంగా ఉగ్ర మూకలకు బలైన మధుసూదన్ది నెల్లూరు జిల్లా కావలి. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా బెంగుళూరులో స్థిరపడ్డారు. అక్కడే ఇల్లు కొనుక్కొని కుటుంబంతో జీవిస్తున్నారు. కశ్మీర్ విహార యాత్రకు వెళ్లిన మధుసూదన్ను పహల్గాంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు.