రాష్ట్రంలో ఉగ్రలింకులు గత ప్రభుత్వ పాపమే-హోంమంత్రి
x

రాష్ట్రంలో ఉగ్రలింకులు గత ప్రభుత్వ పాపమే-హోంమంత్రి

ఉగ్ర కదలికల విషయంలో గత వైసీపీ సర్కారు ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులు బలపడ్డాయని ఆరోపించిన అనిత


రాష్ట్రంలో ఉగ్ర లింకులకు గత ప్రభుత్వ ఉదాసీన వైఖరే కారణమని ఏపీ హోంశాఖా మంత్రి అనిత వ్యాఖ్యానించారు.విజయనగరం, అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఉగ్ర లింకులు బయటపడటంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.గత ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో సరిగా వ్యవహరించలేదని,ఉగ్ర కదలికల విషయంలో ఎంతో ఉదాసీనంగా ఉండటం వల్లే ఈ రెండు జిల్లాల్లో ఉగ్రలింకులు బలపడ్డాయన్నారు.గురువారం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి ఉగ్ర లింకుల కేసులో అరెస్ట్ అయిన సిరాజ్ తండ్రి పోలీస్ శాఖలో ఉండటం వల్ల దర్యాప్తు మరింత లోతుగా జరుగుతోందని తెలిపారు.

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్‌ మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా గంజాయి నియంత్రణపై సమీక్షా సమావేశం జరిపిన ఆధారాలు లేవన్నారు.జగన్‌ను మించిన దగాకోరు ఈ దేశంలో ఎవరూ లేరని,ఆయన పక్కనున్న సత్తిబాబు ఇంకా పెద్ద దగాకోరంటూ హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.జగన్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నా తనకు ఇంకా భద్రత కావాలనడం విడ్డూరంగా వుందన్నారు.
ఉగ్రలింకులపై దర్యాప్తు ముమ్మరం
రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు నేపథ్యంలో పోలీసు బృందాలు రంగంలోకి దిగి విచారణను ముమ్మరం చేశాయి. అరెస్ట్ అయిన ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిక్ భార్య సైరా బాను, మహమ్మద్ అలీ భార్య షమీమ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని విచారించారు. ఉగ్రవాదుల భార్యలను పోలీసులు రాయచోటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. ఇరువురికీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు వారిని రాయచోటి సబ్‌జైలుకు తరలించారు.అలాగే ఉగ్రవాది మహమ్మద్ అలీ వరుసకు సోదరుడు మహబూబ్ బాషా బావమరిది జమాల్‌నూ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Read More
Next Story