పది లక్షల కంటే మించిన పనులకు టెండర్లు
x

పది లక్షల కంటే మించిన పనులకు టెండర్లు

ఇరిగేషన్‌ పనులు, నిర్వహాణ, మరమ్మత్తుల కోసం సీఎం చంద్రబాబు రూ.344 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.


ఇరిగేషన్‌ పనులు, నిర్వహణ, మరమ్మత్తుల కోసం సీఎం చంద్రబాబు రూ. 344 కోట్లు మంజూరు చేశారని, వీటిల్లో రూ. 10లక్షలకు మంచిన పనుల కోసం టెండర్లు పిలవాలని ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకుంటూ ఈనెలాఖరు నాటికి ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్‌ ఓ అండ్‌ ఎం పనులపై ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ అధికారులతో సోమవారం మంత్రి నిమ్మల టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓ అండ్‌ ఎం పనుల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయటం సంతోషకరమని అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ మొదలు పెట్టడానికి ముందే పూర్తి చేయాలని మంత్రి సూచించారు. దీనికి సంబంధించి నిత్యం పర్యవేక్షణ అవసరమని, సూపరిండెంట్‌ ఇంజనీర్లు, చీఫ్‌ ఇంజనీర్లు ఆ పని చేయగలిగితే వాటిని సకాలంలో పూర్తి కాగలవని అధికారులకు సూచించారు.

10 లక్షలు దాటిన పనుల నిమిత్తం ఏడు రోజుల గడువులో పూర్తి చేసే విధంగా షార్ట్‌ టెండర్లు పిలవాలని సూచించారు. రూ 10 లక్షల లోపు ఉన్న పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టుకోవచ్చని రామానాయుడు తెలిపారు. ఆ రకంగా ఎక్కడికక్కడ సాగునీటి సంఘాలను చైతన్య పరచడం ద్వారా పనులు త్వరితగతిని పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
గత ప్రభుత్వం ఓ అండ్‌ ఎం పనులను గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల విమర్శించారు. కాలవల్లో కనీసం తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. షట్టర్లు, డోర్లు, గేట్లకు మరమ్మతులు చేయడం కూడా మరిచిందన్నారు. కనీసం గ్రీజు కూడా పెట్టలేదని ఆయన మండిపడ్డారు. వందలు, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్లను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. దీని వల్ల ఆ పనులన్నీ పాడు పడే పోయే స్థితికి వచ్చాయన్నారు. టెలీకాన్‌ఫెరెన్స్‌లో పలు జిల్లాల ఎమ్మెల్యేలు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్, కమిషనర్‌ రామసుందర్‌ రెడ్డి, ఇరిగేషన్‌ అడ్వైజర్‌ వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story