
ఏపీ ఈసెట్ ఫలితాల్లో మెరిసిన తెలంగాణ విద్యార్థులు
34,224 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో 31,922 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఈ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్(ఏపీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమో, బీఎస్సీ(లెక్కలు) విద్యార్థులకు 2025–26వ విద్యా సంవత్సరానికి బీటెక్, బీఈ, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందొచ్చు. ఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు నేరుగా రెండో ఏడాదిలో చేరేందుకు అవకాశం ఉంటుంది. వీటి కోసం త్వరలో ఏపీ ఈసెట్ 2025 కౌన్సిలింగ్ ప్రక్రియ జరగనుంది, దీని ద్వారా ఆయా కలాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35,187 మంది విద్యార్థులు ఈసెట్ పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వీరిలో 34,224 మంది పరీక్షలకు హాజరు కాగా.. వీరిలో 31,922 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఏపీ ఈసెట్ కన్వీనర్ బీ దుర్గాప్రసాద్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాకు చెందిన రేవతి 169 మార్కులు తెచ్చుకొని ఫస్ట్ ర్యాంకు సాధించింది. తర్వాత రెండు, మూడు, నాలుగు ర్యాంకులను కూడా తెలంగాణ విద్యార్థులే దక్కించుకోవడం విశేషం.
Next Story