
జగన్ పర్యటనపై టీడీపీ మైండ్ బ్లాక్ పోస్టులు
బాబాయ్ని వేసేసి.. విగ్రహం ఆవిష్కరించినట్టే.. ఏడాది క్రితం నాగమల్లేశ్వరరావు చావుకి కారణమై, నేడు ఓదార్పు యాత్ర చేస్తున్నాడు జగన్. అంటూ టీడీపీ విమర్శించింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల పర్యటన మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శవ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిçపడింది. నాగమల్లేశ్వరరావు మరణానికి జగనే కారణమంటూ ధ్వజమెత్తింది. ఆ మేరకు టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టింది.
బాబాయ్ని వేసేసి.. విగ్రహం ఆవిష్కరించినట్టే.. ఏడాది క్రితం నాగమల్లేశ్వరరావు చావుకి కారణమై, నేడు ఓదార్పు యాత్ర చేస్తున్నాడు జగన్.
సత్తెనపల్లి బెట్టింగ్ రాయుడు నాగమల్లేశ్వరరావుతో బెట్టింగ్ కట్టించి ప్రాణం తీసింది జగనే.
గంజాయి వద్దు.. బెట్టింగ్ వద్దు అంటూ కట్టడికి చర్యలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు. గంజాయి, బెట్టింగ్ తనకు ముద్దు అంటూ తన హయాంలో ఆ ముఠాలను పెంచి పోషించిన జగన్ రెడ్డి.
జగన్ వై నాట్ 175 ఫేక్ పబ్లిసిటీని నమ్మి, బెట్టింగ్ కాసి, అప్పుల పాలై, బెట్టింగ్ రాయుడు సత్తెనపల్లి నాగమల్లేశ్వరరావు ఏడాది క్రితం చనిపోతే.. ఇప్పుడు శవ రాజకీయం చేస్తున్నాడు జగన్.
బెట్టింగ్ని జగన్ ప్రోత్సహిస్తే, అనిల్ కుమార్ బెట్టింగ్ మాఫియా నడిపాడు. చివరికి వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు బెట్టింగ్కి బలయ్యాడు.
నీ అధికారంలో నీ మాట నమ్మి బెట్టింగ్ కాసి ఓడిపోయి, డబ్బులు పోగొట్టుకుని బలవన్మరణానికి పాల్పడితే దాంతో కూటమి ప్రభుత్వానికి ఏం సంబంధం జగన్ రెడ్డీ? అప్పుడు వెళ్తే అందరూ ఛీ కొడతారని వెళ్లకుండా... ఏడాది తర్వాత శవరాజకీయం చేయడానికి వెళ్తున్నావా?
మనిషి పోయిన ఏడాది తర్వాత నానా హంగామా చేస్తూ సత్తెనపల్లికి ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్... వైసీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు మరణానికి కూటమి ప్రభుత్వమే కారణం అంటున్నాడు. అది ఎలాగో మరి. అతను చనిపోయింది బెట్టింగ్ వల్ల. అప్పటికి జగనే అధికారంలో ఉన్నది. కూటమి అధికారంలోకి వచ్చింది 2024 జూన్ 12న. నాగమల్లేశ్వరరావు గడ్డి మందు తాగింది జూన్ 5న, చనిపోయింది జూన్ 9న. ఎక్కడైనా లింక్ ఉందా? అంటూ టీడీపీ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాళ్ల పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించింది.