
లిక్కర్ స్కాంపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇది కేవలం రూ.3,200 కోట్ల స్కాం కాదు.. 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న స్కాం అంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఏపీ మద్యం కుంభకోణం పై తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ భారీ లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ విచారణ జరపాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. రూ. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నానని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెడితే, అది ఫేక్ అని కూడా తెలుసుకోకుండానే ఈడీ స్పందించిందని అలాంటిది ఇంత పెద్ద ఏపీ లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ అదే విధంగా స్పందించాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని , ఇది కేవలం రూ.3,200 కోట్ల స్కామ్ మాత్రమే కాదు 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న స్కామ్ అని చెప్పారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఈడీ విచారణ జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు.పహల్గామ్ టెర్రరిస్టులపై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు చూశామంటూనే ,అదే విధంగా ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారని సోమిరెడ్డి అన్నారు.లిక్కర్ స్కామ్ ను దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు స్వర్ణ పతకాలు ఇవ్వాలని ఆయన ఎద్దేవా చేశారు.