
బీహార్ రాజకీయాన్ని వేడెక్కించిన నారా లోకేశ్
ఈసారి చంద్రబాబుకు బదులు నారా లోకేశ్ బీహార్ లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు..
బీహార్ ఎన్నికల వేడిలో రగులుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ రాష్ట్ర రాజకీయాల్ని మరింత వేడెక్కించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా చేరుకున్న లోకేశ్ క్షణం తీరిక లేకుండా రాజకీయ మంతనాలు ఓవైపు పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధినేతలతో భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశాన్ని బీహార్ ప్రచారంలో ప్రచారం కోసం నారా లోకేశ్ ని ప్రత్యేక ఆహ్వానించడం గమనార్హం. సహజంగా ఇటువంటి ప్రచారాలకు ఇంతకుముందు చంద్రబాబు వెళ్లేవారు. ఇప్పుడాయన స్థానాన్ని ఆయన కుమారుడు లోకేశ్ భర్తీ చేస్తున్నారు.
పాట్నా చేరుకున్న లోకేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ను ప్రమోట్ చేస్తున్నారు.
రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ సమావేశమయ్యారు.
"దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా బీహార్ కూడా నితీష్ కుమార్ కు ముందు, తర్వాత అన్నవిధంగా అభివృద్ధి సాధించింది. సమర్థవంతమైన నాయకుడివల్లే బీహార్ అభివృద్ధి సాధిస్తోంది. లీడర్ షిప్ ట్రాక్ రికార్డుతోపాటు శాంతిభద్రతలు, మహిళల భద్రత, అవినీతి రహిత పాలనే ఇందుకు కారణం. కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాల విషయంలో ఎపి, బీహార్ లకు సారూప్యతలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బులెట్ సర్కారు కారణంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లే మా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి" అని లోకేశ్ చెప్పడం గమనార్హం.
ఆయన అంతటితోనే ముగించలేదు. ఇంకా ఏమన్నారంటే "భారత్ లో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎపికి రావడానికి ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వనీవైష్టవ్ ల సహకారం కూడా కీలకంగా ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాజిటివ్ లీడర్ షిప్, టాక్సేషన్ లో మార్పుల కారణంగా కేవలం 12నెలల్లో ఎపికి గూగుల్ సంస్థను రప్పించగలిగాం. అలాగే దేశంలో అతిపెద్ద ఉక్కుపరిశ్రమను ఆర్సెలర్స్ మిట్టల్ ఎపిలో ఏర్పాటు చేయబోతోంది. వారిని రాష్ట్రానికి ఆహ్వానించినపుడు మూడు ప్రధాన సమస్యలు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానితో మాట్లాడటంతో వెనువెంటనే ఆ మూడు సమస్యలు పరిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్ ను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇందుకోసం మా ముఖ్యమంత్రి విజన్ 2047 డాక్యుమెంట్ ను రూపొందించి, లక్ష్యాలను నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం పిపిఎలను రద్దుచేయడం వల్లే ఈసారి పెట్టుబడుల సాధనకు పదిరెట్లు కష్టపడాల్సి వస్తోంది. రాష్ట్రాలు వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే లీడర్ షిప్ ట్రాక్ రికార్డుతోపాటు ప్రభుత్వాల కొనసాగింపు కూడా ముఖ్యం. గుజరాత్, ఒరిస్సా రాష్ట్రాల ప్రభుత్వాల కొనసాగింపు వల్ల పెద్దఎత్తున అభివృద్ధి సాధించాయి. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాపై ఎంతో నమ్మకంతో 94శాతం సీట్లతో మమ్మల్ని గెలిపించారు. ఏపిలో యువతకు ఉద్యోగాలు కల్పించడం ప్రస్తుతం మా ముందున్న ప్రధాన లక్ష్యం. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నాం. త్వరలో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహించబోతున్నాం" అని లోకేశ్ చెప్పారు.
లోకేశ్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీహార్ ఇండస్ట్రీ అసోసియేషన్ నాయకులు రాంజీ, గోయంకా, మాజీ ఎంపి జివిఎల్ నరసింహారావు, రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు, బీహార్ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.
ఆ తర్వాత బీహార్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో పాల్గొన్నారు. బీహార్ లో మొదటిసారి పర్యటిస్తున్నానని, ఏపీ మంత్రిగా బీహార్ కు రాలేదని భారతీయుడిగా వచ్చానని కూడా స్పష్టంచేశారు.
ఎన్డీయే భాగస్వామిగా, దేశ పౌరుడిగా ఇది నా బాధ్యత. అందుకే ఇక్కడ ప్రచారానికి వచ్చానని చెబుతూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో పడ్డారు.
Next Story

