
‘సురక్ష 360’తో నేరాల నియంత్రణ
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేటు తగ్గుతుందని హోం మంత్రి అనిత అన్నారు.
‘సురక్ష360’ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ విజయవాడ కార్యాలయంలో శనివారం ఆమె దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు 7వేల సీసీ కెమెరాలు, 28 డ్రోన్లతో కూడిన సురక్ష డివైజ్లను పోలీసు అధికారులకు హోం మంత్రి అనిత అందజేశారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి ఆలయం, చర్చి, మసీదులలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా ఈ సురక్ష డివైస్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ సురక్ష డివైజ్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి గ్రామం, పత్రి వీధి కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచుతూ నేరాల సంఖ్యను తగ్గించాలనే లక్ష్యంతోనే రాష్ట్ర వ్యాప్తంగా సురక్ష 360ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో విజయవాడ పోలీసు కమిషనరేట్ రాష్ట్రంలో అందరి కంటే ముందంజలో ఉందన్నారు. మోడల్ పోలీసు స్టేషన్లు జిల్లా అంతటా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో సురక్ష డివైజ్లను ఏర్పాటు చేసి 321 గ్రామాలు, 20 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 64 వార్డులు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 1211 చదరపు కిలో మీటర్ల మేర ప్రజల భద్రత కోసం నిరంతర పర్యవేక్షణ కోసం సురక్ష డివైజ్లను ఏర్పాటు చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సురక్ష 360ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.