
ప్రశ్నించినందుకు ప్రొఫెసర్పై విద్యార్థి దాడి
ఒక్క సారిగా భయాందోళనలకు గురైన నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల.
ల్యాబ్లకు సక్రమంగా హాజరు కావడం లేదని ప్రశ్నించినందుకు ఫ్రొఫెసర్పై ఓ విద్యార్థి దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎంటెక్ చదువుతున్న వినయ్ పురుషోత్తం అనే ఓ విద్యార్థి ల్యాబ్లకు సరిగా హాజరు కావడం లేదు. దీనిని గమనించిన ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి, ఫ్రొఫెసర్ గోపాలరాజు ఆ విద్యార్థిని ల్యాబ్లకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. దీంతో ఆ విద్యార్థి కోపోద్రిక్తుడయ్యాడు. తన మంచి కోసమే అలా వ్యవహరించారనే విషయాన్ని పట్టించుకోకుండా నన్నే ప్రశ్నిస్తావా అంటూ కోపంతో ఊగిపోయాడు. రాక్షసుడిగా మారిన ఆ విద్యార్థి ప్రొఫెసర్ గోపాలరాజుపైన కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ ప్రొఫెసర్ గాయపడ్డారు.
ఈ ఘటనతో నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాలు ఒక్క సారిగా ఉలిక్కి పడింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. షాక్లో నుంచి తేరుకున్న సహచర సిబ్బంది గాయపడిని ప్రొఫెసర్ గోపాలరాజుని వెంటనే నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన అధ్యాపకుడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నూజివీడు ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు, దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.